పాలశీతలీకరణ కేంద్రాల్లో అధికారుల తనిఖీలు
ABN , First Publish Date - 2021-06-23T06:59:00+05:30 IST
మండలంలోని పలు పాలశీతల కేంద్రాల్లో, పాలసేకరణ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు చేశారు.
దర్శి, జూన్ 22 : మండలంలోని పలు పాలశీతల కేంద్రాల్లో, పాలసేకరణ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు చేశారు. దర్శిలోని మోడల్డైరీ, మోహన్ మిల్క్ డైరీలతోపాటు వెంకటచలంపల్లి, లంకోజనపల్లి గ్రామాల్లోని పలు పాలసేకరణ కేంద్రాల్లో జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి నాగూల్మీరా, స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారి జిలానీబాషా పరిశీలించారు. 16 శ్యాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపుతున్నట్లు అధికారి నాగూల్మీరా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి ప్రాంతంలో కొత్తరెడ్డిపాలెం, ఎర్రోబనపల్లి, దర్శి రూరల్, తాళ్లూరు మండలంలోని విఠలాపురం, దారంవారిపాలెం తదితర గ్రామాల్లో కొందరు కల్తీ పాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేసి కల్తీ పాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని చెప్పారు.