కోలాహలంగా నామినేషన్లు
ABN , First Publish Date - 2021-02-05T06:22:28+05:30 IST
నియోజకవర్గంలోని పలు పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది.
![కోలాహలంగా నామినేషన్లు](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020512483617/02052021004942n89.jpg)
అర్థరాత్రి వరకు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ
పోటాపోటీగా నామినేషన్లు
వైసీపీకి రెబల్స్ బెడద
దర్శి, ఫిబ్రవరి 4 : నియోజకవర్గంలోని పలు పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. మండలంలో 25 పంచాయతీలు 250 వార్డులు ఉన్నాయి. వైసీపీ, టీడీపీ సానుబూతిపరులు పలు పంచాయతీల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. వెంకటచలంపల్లి, బండివెలిగండ్ల, రామచంద్రాపురం, తానంచింతల పంచాయతీల్లో వైసిపీ రెబల్ అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు. జముకలదిన్నె, బసిరెడ్డిపల్లి, ఎర్రోబనపల్లి, తూర్పువెంకటాపురం పంచాయతీల్లో వైసిపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
దొనకొండ : మండలంలో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాల్లో కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. దొనకొండలో వైసీపీ అభ్యర్థిగా కొంగలేటి. గ్రేస్ రత్నకుమారి, మాజీ ఎంపీపీ ఆదిమూలపు.విజయనిర్మలలు వారి అనుచరులతో నామినేషన్లు దాఖలు చేశారు. గంగదేవిపల్లి, దొనకొండ, ఆరవళ్లిపాడు నామినేషన్ కేంద్రాలను వైసీపీ మద్దతుదారుల నామినేషన్లో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొన్నారు.
కొండపి : మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు నిర్ణయించిన ఆరు క్టస్టర్ గ్రామాల్లోని సచివాలయ కేంద్రాలను గురువారం తహసీల్దార్ కామేశ్వరరావు, ఎస్సై వి.రాంబాబు, ఇన్చార్జ్ ఎంపీడీవో ఎం.విజయలక్ష్మి పరిశీలించారు. ముప్పవరం, వెన్నూరు గ్రామాల్లోని సచివాలయాలను పరిశీలించారు.
మర్రిపూడి : మండలంలోని 21 పంచాయతీలకు గురువారం ప్రధాన పార్టీల మద్దతుదారులు ఆయా నామినేషన్ కేంద్రాలలో కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. జువ్విగుంట, తంగెళ్ల, వెంకటకృష్ణాపురం, రామాయపాలెం, పన్నూరు, కెల్లంపల్లి, అయ్యపురాజుపాల్లెల్లో వైసీపీ, టీడీపీ మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేశారు. రేగలగడ్డ, కూచిపూడి, రావెళ్లవారిపాలెం, వేమవరం, నర్సరాజుపాలెం, చిలంకూరు పంచాయతీలలో టీడీపీ మద్దతుదారులు పోటీ చేయలేదు. ఆయా పంచాయతీలలో వైసీపీ మద్దతుదారులకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నాయి. గుండ్లసముద్రం పంచాయతీలో వైసీపీ పోటీ చేయలేదు. ఇక్కడ టీడీపీలో రెండు వర్గాల వారు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. వల్లాయిపాలెం, మర్రిపూడి, చిమట, ధర్మవరం, కాకర్ల, గార్లపేట, అంకేపల్లి గ్రామ పంచాయతీలలో వైసీపీ తరఫున రెబల్స్ బరిలోకి దిగారు. ఈ గ్రామాల్లో టీడీపీ తరఫున కూడా నామినేషన్లు వేశారు. రేగలగడ్డలో వైసీపీ తరఫున తాజా మాజీ సర్పంచ్ బోగసముద్రం వెంకటరత్నం మరోమారు ఏకగ్రీవంగా సర్పంచ్కి ఎన్నికయ్యారు. మర్రిపూడిలో టీడీపీ తరఫున డాక్టరు కొణిదెన మోహన్రావు, మర్రిపూడి ఏడుకొండలు, వైసీపీ మద్దతుతో రవిప్రసాద్, కదిరి పార్థసారథిలు నామినేషన్లు వేయగా, మాజీ సర్పంచ్ ఎం.శ్రీనివాసులు రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మర్రిపూడిలో టోకెన్లు ఇచ్చి రాత్రి వరకుకూడా నామినేషన్లు స్వీకరించారు.
ముండ్లమూరు : నామినేషన్ కేంద్రాల వద్ద గురువారం రాత్రి వరకు కూడా అభ్యర్థుల వరసలు కొనసాగాయి. పెదఉల్లగల్లు సర్పంచ్ స్థానానికి టీడీపీ మద్దతుదారుగా మంచు సుహాసిని, శంకరాపురంలో కూరపాటి మహేశ్వరి, ముండ్లమూరులో ఒద్దిపోగు ఆదిలక్ష్మి, పసుపుగల్లులో వరగాని ఇసాకు, వేములలో గజ్జెల ఆదెమ్మలు టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. కెల్లంపల్లి నుండి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా తొలుచూరి శ్రీను నామినేషన్ దాఖలు చేశారు. సింగన్నపాలెం నుంచి కందిమళ్ల గీతాంజలి, శంకరాపురం నుంచి మేడికొండ జయంతి, నాయుడుపాలెం నుండి గొర్రె భారతి నామినేషన్లు దాఖలు చేశారు. పసుపుగల్లు నుండి గర్నెపూడి ప్రసన్న నామినేషన్ దాఖలు చేశారు. నాయుడుపాలెంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థికి కొంతమంది టీడీపీ నాయకులు మద్దతు పలుకుతూ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెల్లంపల్లిలో జమ్ముల గురవయ్య, ఈదరలో వంగల పద్మావతి, ఉమామహేశ్వర అగ్రహారంలో వేముల గౌరి తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.
తాళ్లూరు : మండలంలోని 16 పంచాయతీలకు అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా సర్పంచ్, వార్డు సభ్యులకు గురువారం నామినేషన్లుదాఖలు చేశారు. మండలంలోని మల్కాపురం గ్రామపంచాయితీకి ఏకపక్షంగా వైసీపీ మద్దతు దారులు పోటీలో నిలువగా టీడీపీ మద్దతు దారులు పోటీలో నిలువ లేదు. విఠలాపురం, బొద్దికూరపాడు గ్రామపంచాయతీలకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వర్గీయులు ఇరువురుపోటీలో నిలిచారు. కొర్రపాటివారిపాలెం, తురకపాలెం, లక్కవరం,మన్నేపల్లి పంచాయతీయలకు టీడీపీ మద్దతు దారులు నేరుగా పోటీలో నిలువగా, మిగిలిన పంచాయతీలలో అధికారపార్టీ అస్మతి వాదులకు మద్దతు ప్రకటిస్తూ పోటీలో నిలిచారు. అధికారపార్టీలో వున్న అసమ్మతి వల్ల తమకు లాభం చేకూరుతుందని పలువురు టీడీపీ అధినాయకత్వం నిర్ణయం మేరకు పలు పంచాయతీలలో సర్పంచ్, వార్డులందు పోటీలో నిలిచారు. అన్ని గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష నేతలు పోటీలో నిలిచారు.
సర్పంచ్ పదవికి 129 నామినేషన్లు
దొనకొండ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 2వ తేది నుండి మూడు రోజులుగా నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో 18 గ్రామ పంచాయతీలకు గాను 129 నామినేషన్లు, 184 వార్డులకు గాను 353 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి కె.జీ.య్స.రాజు తెలిపారు. దొనకొండ సర్పంచ్కు 11 నామినేషన్లు, వార్డులకు 45, పెద్దన్నపాలెం సర్పంచ్కు 5, వార్డులకు 22, ఇండ్లచెరువు సర్పంచ్కు 6, వార్డులకు 18, వెంకటాపురం సర్పంచ్కు 6, వార్డులకు 14, ఆరవళ్లిపాడు సర్పంచ్కు 4, వార్డులకు 34, తెల్లబాడు సర్పంచ్కు 09, వార్డులకు 4, వద్దిపాడు సర్పంచ్కు 7, వార్డులకు 9, సంగాపురం సర్పంచ్కు 13, వార్డులకు 10, మల్లంపేట సర్పంచ్కు 5, వార్డులకు 22, పోలేపల్లి సర్పంచ్కు 6, వార్డులకు 20, లక్ష్మీపురం సర్పంచ్కు 7, వార్డులకు 13, చందవరం సర్పంచ్కు 14, వార్డులకు 15, మంగినపూడి సర్పంచ్కు 04, వార్డులకు 13, భూమనపల్లి సర్పంచ్కు 7, వార్డులకు 8, రుద్రసముద్రం సర్పంచ్కు 6, వార్డులకు 17, రామాపురం సర్పంచ్కు 6, వార్డులకు 14, కొచ్చెర్లకోట సర్పంచ్కు 8, వార్డులకు 38, గంగదేవిలపల్లి సర్పంచ్కు 5, వార్డులకు 37 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.