ముటుకుల ప్రాజెక్టును గాలికొదిలేశారు
ABN , First Publish Date - 2021-11-06T05:18:05+05:30 IST
మూడు మండలాల్లోని 44 గ్రామాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగు నీటి కోసం నిర్మించిన ముటుకుల తాగు నీటి పఽథకాన్ని గాలికి వదిలేశారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీపీఐ సీనియర్ నాయకుడు కేవీవీ ప్రసాద్ అన్నారు.

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్
పుల్లలచెరువు, నవంబరు 5 : మూడు మండలాల్లోని 44 గ్రామాల ప్రజలకు ఫ్లోరైడ్ రహిత తాగు నీటి కోసం నిర్మించిన ముటుకుల తాగు నీటి పఽథకాన్ని గాలికి వదిలేశారని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీపీఐ సీనియర్ నాయకుడు కేవీవీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం ముటుకుల తాగు నీటి పథకాన్ని సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009లో నిర్మించిన ఈ ప్రాజెక్టులకు ఇప్పటికి 36 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు మార్చుకున్నారని అన్నారు. ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి 44 గ్రామాలకు నీరు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ నీరు ఇవ్వలేదని విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో వున్న మంత్రి ఆదిమూలపు సురేష్ ముటుకుల ప్రాజెక్టు నుంచి నీళ్ళు రాలేదని ఉద్యమం చేసి పాదయాత్ర చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నీళ్లు ఇవ్వడం లేదని, ఆ ప్రాజెక్టును పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాంట్రాక్టరు నాసిరకంగా నిర్మించడం వల్లే నీటి సరాఫరా జరగడం లేదని అన్నారు. 15 రోజుల్లోగా ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురాకపోతే తాగు నీరు అందించాల్సిన గ్రామాల ప్రజలను కలుపుకోని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టరు స్పందించి ప్రాజెక్టు నిర్వహణ, నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి సంబంధి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జీవీ గురునాఽథం, సీపీఐ నాయకుడు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రెహమాన్, ముటుకుల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రాయితీని పునరుద్ధరించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సూక్ష్మ బిందు సేద్య పరికరాలను రాయితీలను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరణ చేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎర్రగొండపాలెంలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ మహాధర్నా వాల్పోస్టరును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డి. శ్రీనివాస్,సీపీఐ నాయకులు కేవీ గౌడ్, యోగయ్య, ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.