ఎంపీడీవో కార్యాలయానికి గ్రహణం
ABN , First Publish Date - 2021-03-25T04:25:14+05:30 IST
స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న ఎంపీడీవో కార్యాలయం భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

అభివృద్ధి కార్యకలాపాలకు ఆటంకం
పెండింగ్లో బిల్లులు
పెద్ద దోర్నాల, మార్చి 24 : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న ఎంపీడీవో కార్యాలయం భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.1.20 లక్షల నిధులతో 2016లో నిర్మాణ పనులు ప్రారంభించారు. తొలుత పనులు వేగవంతంగా జరిగాయి. అనంతరం పనులు నిలిచి పోయాయి. జరిగిన నిర్మాణ పనులకు బిల్లులు చెల్లింపులు కూడా జరగలేదని సుమారు 60లక్షల వరకు పెండింగులో ఉన్నట్లు ఉప కాంట్రాక్టర్ వాపోతున్నాడు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతున్నాడు. గతంలో కూడా ఐనముక్కుల గ్రామం సమీపంలో నిర్మాణం పూర్తయి కార్యక్రమాలు చేపట్టాలనుకునే సమయంలో మావోయిస్టులు పేల్చేశారు. దీంతో ప్రభుత్వం తిరిగి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించేలా మళ్లీ నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు సగంలో ఉండగా పనులు నిలిచి పోయాయి. దీంతో మండల అభివృద్ధి కార్య నిర్వహణ అనియత విద్యా భవనంలోనే కొనసాగిస్తున్నారు. ఎంపీడీవో భవనానికి గ్రహణం పట్టినట్లయిందని పలువురు భావిస్తున్నారు. లక్షల రూపాయల నిధులు నిరుపయోగంగా మిగిలి పోకుండా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రీ టెండర్ వేయాల్సి ఉంది
అర్ధాంతంగా నిలిచిపోయిన ఎంపీడీవో భవన నిర్మాణంపై పంవచాయతీరాజ్ శాఖ ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా కాంట్రాక్టర్ మృతి చెందాడని ఆయనచేసిన పనుల వరకు బిల్లులు చెల్లించి, త్వరలో మిగిలిన నిర్మాణ పనులకు రీటెండర్ పిలవనున్నట్లు తెలిపారు.