ఎర్ర జెండా రెపరెపలు

ABN , First Publish Date - 2021-05-02T06:26:12+05:30 IST

జిల్లావ్యాప్తంగా శనివారం ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే వేడుకలు వామపక్ష పార్టీలు, ప్రధాన కార్మికసంఘాల ఆధ్వర్యంలో జరిగాయి.

ఎర్ర జెండా రెపరెపలు
ఒంగోలులోని సీపీఎం కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరిస్తున్న ఆ పార్టీ నాయకుడు పూనాటి తదితరులు

నిరాడంబరంగా మేడే వేడుకలు

ర్యాలీలు, సభలు రద్దు, జెండావిష్కరణలకే పరిమితం

ఒంగోలు, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శనివారం ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ప్రపంచ కార్మిక  దినోత్సవమైన మేడే వేడుకలు వామపక్ష పార్టీలు, ప్రధాన కార్మికసంఘాల ఆధ్వర్యంలో జరిగాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈసారి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలను రద్దు చేసుకొని వామపక్ష పార్టీల కార్యాలయాలు, అనుబంధ సంఘాల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలకు మాత్రమే పరిమితమయ్యారు. ఒంగోలులోని సీపీఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్‌ వద్ద విశాఖ అర్బన్‌ బ్యాంకు వైస్‌చైర్మన్‌, ప్రముఖ న్యాయవాది ముదివర్తి రాఘవరావు ఎర్రజెండాను ఎగురవేయగా పార్టీ నాయకులు యు.ప్రకాశరావు, ఎస్‌డీ సర్దార్‌ పాల్గొన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం వద్ద పార్టీ జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు జెండాను ఆవిష్కరించగా పార్టీ నేతలు పెంట్యాల హనుమంతరావు, కె.ఆంజనేయులు పాల్గొన్నారు. సీఐటీయూ కార్యాలయం వద్ద  ఆ సంఘం జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు జెండాను ఆవిష్కరించగా నగరంలోని 40కిపైగా ప్రాంతాల్లో వామపక్ష పార్టీలు, కార్మికసంఘాల ఆధ్వర్యంలో  కార్యక్రమం జరిగింది.  చీరాల, అద్దంకి, చీమకుర్తి, పొదిలి, దర్శి, కనిగిరి, కందుకూరు, పామూరు, మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం తదితరప్రాంతాలతోపాటు పలు మండల కేంద్రాల్లోనూ మేడే వేడుకలు జరిగాయి. కేంద్రం తెచ్చిన సాగుచట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాడాలని ఈ సందర్భంగా కార్మిక, వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. 



Updated Date - 2021-05-02T06:26:12+05:30 IST