కరోనా పరిహారం కోసం భారీగా దరఖాస్తులు
ABN , First Publish Date - 2021-12-02T07:27:40+05:30 IST
జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారం కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి.
అందిన 1,652లో 1,575దరఖాస్తుల ఆమోదం
77 తిరస్కరణ
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 1: జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారం కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50వేలు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అందుకనుగుణంగా ఒంగోలులో పక్షం రోజులుకుపైగా దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,652మంది పరిహారం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని పరిశీలించేందుకు జిల్లాస్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా జేసీ టీఎస్ చేతన్ ఉండగా మరో ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల పరిహారం కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. అందులో 1,652ను ఆమోదించగా, 77 దరఖాస్తులకు సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో తిరస్కరించారు. అయితే పరిహారం కోసం ఆమోదించిన దరఖాస్తులకు సంబంధించి త్వరలో మృతుల కుటుంబసభ్యుల బ్యాంకు అకౌంట్లలో నగదును జమచేయనున్నారు. అయితే ఆమోదించిన దరఖాస్తులన్నింటికీ పరిహారం ఇస్తారా లేక ఏదో ఒక కారణం చూపి తగ్గించి ఇస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.