కొటికలపూడిలో వీడిన ఉత్కంఠ
ABN , First Publish Date - 2021-02-15T06:40:48+05:30 IST
మండలంలోని కొటికలపూడి పంచాయతీ సర్పంచ్ పదవి లాటరీ ద్వారా టీడీపీ వర్గీయులను వరించింది.
లాటరీలో టీడీపీని వరించిన సర్పంచ్ పదవి
అద్దంకి, ఫిబ్రవరి 14 :మండలంలోని కొటికలపూడి పంచాయతీ సర్పంచ్ పదవి లాటరీ ద్వారా టీడీపీ వర్గీయులను వరించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఉత్కంఠ కొనసాగగా అధికారులు లాటరీ పద్ధతి ద్వారా సర్పంచ్ పదవిని తేల్చారు. కొటికలపూడి పంచాయతీలో మొత్తం 1673 ఓట్లు పోలు కాగా టీడీపీ మద్దతుతో పోటీచేసిన పూనాటి విక్రమ్ , వైసీపీ మద్దతుతో పోటీ చేసిన భీమని సిద్దయ్యలకు సమానంగా 820 ఓట్లు వచ్చాయి. 33 ఓట్లు చెల్లకుండా పోయాయి. 4 పోస్టల్ ఓట్లు ఉండగా గజిటెడ్ అ ధికారి సంతకాలు లేకపోవటంతో చెల్లనివిగా ప్రకటించారు. ఓట్లు సమంగా రావటంతో సర్పంచ్పై ఉత్కంఠ కొనసాగింది. అర్ధరాత్రి సమయంలో ఎంపీడీవో రాజేందర్, పోలీస్ అధికారులు గ్రామానికి చేరుకొని ఇరువర్గీయులతో చర్చించారు. లాటరీ లేదా టాస్ ద్వారా తేల్చుకోవాలని సూచించారు. టీడీపీ వర్గీయులు సమ్మతించగా, వై సీపీ వర్గీయులు నిరాకరించారు. వేకువజామున 2 గంటల సమయంలో లాటరీ వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం లాటరీ తీయగా టీడీపీ మద్దతుతో పోటీ చేసిన పూనాటి విక్రమ్ను సర్పంచ్ పదవి వరించింది. మొత్తం 10 వార్డులు ఉండగా టీడీపీ మద్దతుదారులు 6, వైసీపీ మద్దతుదారులు 4 కైవసం చేసుకున్నా రు. ఉపసర్పంచ్గా చందలూరి అంజమ్మను ఎన్నుకున్నారు.