నిమ్మగడ్డపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్
ABN , First Publish Date - 2021-01-25T03:43:08+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్...
ఒంగోలు : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ జగన్ సర్కార్ మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో రేపు అనగా సోమవారం నాడు తీర్పు వెలువడనుంది. మరోవైపు నిమ్మగడ్డపై వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఈ మొత్తం వ్యవహారంపై స్పందించారు. ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. అద్దాల్లో కూర్చోని నిమ్మగడ్డ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ఆయన అద్దాల్లో కూర్చుని అలా చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం జనంలోకి వెళ్లి సర్వీసు చెయ్యాలా..? అంటూ ఆమె సూటి ప్రశ్న సంధించారు.
ఆయనే కుట్ర చేస్తున్నారు!
‘ఒక వ్యక్తి అడిస్తున్న నాటకానికి నిమ్మగడ్డ బలిపశువు అవుతున్నారు. ఉద్యోగులను సస్పెండ్ చేస్తే ఏమవుతుంది..?. మార్చిలో నిమ్మగడ్డ పదవీ విరమణ చేస్తారు. సస్పెండ్ అయిన ఉద్యోగులు ఆతరువాత ఉద్యోగాల్లో చేరతారు. ఒక వ్యక్తి స్వార్థానికి వ్యవస్థని బలిపెట్టకండి. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాల్లో అల్లర్లు చేయించి హత్యలు చేయించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు’ అంటూ పార్వతి సంచలన కామెంట్స్ చేశారు.