వెలిగొండ ఫీడర్ కెనాల్కు రంధ్రం
ABN , First Publish Date - 2021-08-25T06:09:08+05:30 IST
వెలిగొండ ఫీడర్ కెనాల్కు రంధ్రం పడింది. దీంతో వరద నీరు పంట పొలాలపై పరుగు తీయడంతో నష్టం వాటిల్లింది.

మునకెత్తిన పంట పొలాలు
కోతకు గురవుతున్న వ్యవసాయ భూములు
స్పందించని అధికారులు
పెద్ద దోర్నాల, ఆగస్టు 24 : వెలిగొండ ఫీడర్ కెనాల్కు రంధ్రం పడింది. దీంతో వరద నీరు పంట పొలాలపై పరుగు తీయడంతో నష్టం వాటిల్లింది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు కానీ ప్రాజెక్టు కోసం నిర్మించిన ఫీడర్ కాలువలు మాత్రం రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కాంట్రాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి కాలువలు నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వానలకే కట్టలు తెగిపోతున్నాయి. వరద నీరు పొలాలపై ప్రవహించి పంటలను నష్టపరుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కొద్దిపాటి వర్షానికి ఫీడర్ కాలువకు వరదనీరు చేరింది. ఈక్రమంలో మండలంలోని కటకానిపల్లె ఎగువ ప్రాంతాన నిర్మించిన ఫీడర్ కెనాల్ కరకట్ట అడుగుభాగాన రంధ్రం పడింది. దాని ద్వారా నీరు బయటకు వచ్చి పంట పొలాలను ముంచెత్తింది. సాగు చేసిన పత్తి పంట పూర్తిగా నీటి పాలైంది. మొత్తం 20ఎకరాల సాగు భూములు ముంపునకు గురయ్యాయని, పోయిన ఏడాది ఇదే సమయంలో కూడా కరకట్ట తెగి వరద నీరు పారడంతో పంటలు కోల్పోయామని కటకానిపల్లె గ్రామ రైతులు షేక్ రసూల్, లింగం వెంకటేశ్వర్లు, బాబు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు విషయం చెప్పినా స్పందించలేదన్నారు. పైగా మీరే ఏదైనా మార్గం చూసుకోవాలని, తర్వాత నివారణ చర్యలు చేపడతామని బదులిచ్చారని తెలిపారు. కాగా రెండేళ్ల క్రితం కూడా కడపరాజుపల్లె సమీపంలో ఫీడర్ కాలువ తెగి 60 ఎకరాల్లో సాగు చేసిన పత్తి, మిరప, బొప్పాయి, అరటి పూర్తిగా నీటి పాలయ్యాయి. భూములు కోతకు గురయ్యాయి. నేటికీ ఎలాంటి సహాయం అందించలేదని ఆ గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. కొద్దిపాటి వర్షాలకే కట్టలు తెగితే రేపు కృష్ణాజలాలు విడుదల జరిగితే ఈ కాలువలు ఉంటాయా అని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత జేయీ రాహుల్ను ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులో లేరు.
