రాష్ట్రంలో అరాచక పాలన

ABN , First Publish Date - 2021-10-20T06:28:26+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్ల శ్రీనివాసులరెడ్డిలు విమర్శించారు.

రాష్ట్రంలో అరాచక పాలన
నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

 టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనలు

 నేడు బంద్‌కు పిలుపు

 ప్రజాదరణను ఓర్వలేకేనంటున్న టీడీపీ 

కనిగిరి, అక్టోబరు 19: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని నగర పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్ల శ్రీనివాసులరెడ్డిలు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, నేతల ఇళ్లపై వైసీపీ రౌడీమూకలు దాడిని ఖండిస్తూ పట్టణంలో నిరసనగా నోటికి నల్ల మాస్కులు ధరించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీకి నానాటికి ప్రజాధరణ పెరుగుతోందన్నారు. దీన్ని ఓర్వలేక సీఎం జగన్‌ రౌడీమూకలతో టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నేతల ఇళ్ళపై దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సీయం జగన్‌పాలనలో కూని అవుతోందని ద్వజమెత్తారు. టీడీపీ నియోజకరవ్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాలతో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ అంజుమన్‌ కమిటీ అధ్యక్షులు రోషన్‌ సందాని, టీడీపీ మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు యాదవ్‌, తమ్మినేని వెంకటరెడ్డి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, జంషీర్‌ అహ్మద్‌, బ్రహ్మంగౌడ్‌, ముచ్చుమూరి చెంచిరెడ్డి, ఫిరోజ్‌,  తిరుపాలు, చిలకపాటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు బస్టాండులో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు.

ఫ్యాక్షనిజమే పాలన అనుకుంటున్న జగన్‌రెడ్డి : రమేష్‌

ఉలవపాడు : రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యాక్షనిజమే పరిపాలన అనుకుంటున్నాడని నెల్లూరు పార్టమెంట్‌ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి అమ్మనబ్రోలు రమేష్‌ యాదవ్‌ ఆరోపించారు. డీజీపీ కార్యాలయానిక కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడం గర్హనీయమన్నారు. దాడిని ఖండించిన వారిలో టీడీపీ మండల అధ్యక్షుడు రాచగల్లు సుబ్బారావు, నాయకులు మక్కే నారాయణ, సీహెచ్‌ హరిబాబు,  తెలుగు యువత మండల అధ్యక్షుడు తొట్టెంపూడి మాల్యాద్రి, తదితరులు ఉన్నారు. 

టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి హేయం

ముండ్లమూరు : టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేయటం దుర్మార్గమైన చర్య అని టీడీపీ మండల అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన ముండ్లమూరులో మాట్లాడుతూ... వైసీపీ నాయకులు, కార్యకర్తలు బరి తెగించారన్నారు. 

 వైసీపీ దాడులపై ఖండన

 పామూరు : వైసీపీ అరాచక శక్తులు మంగళగిరిలోని టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయంపైన, వైజాగ్‌లో పట్టాభిరెడ్డి ఇంటిపైన, హిందుపురంలోని పార్టీ కార్యాలయాలపై మంగళవారం ఒకేసారి మూకుమ్మడి దాడిచేయడాన్ని టీడీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రి చౌదరి తీవ్రంగా ఖండించారు. స్థానిక శేషమహాల్లో టీడీపీ ముఖ్యకార్యకర్తలతో అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కె సుభాషిణి, వైఎస్‌ ప్రసాద్‌రెడ్డి, ఉప్పలపాటి హరిబాబు, పువ్వాడి రామారావు, డోలా శేషాద్రి, షేక్‌ ఖాజారహంతుల్లా, టీవీకే సుబ్బారావు, గౌస్‌బాష తదితరులు ఉన్నారు. 

రాష్ర్టాన్ని రావణ కాష్టం చేస్తున్నారు :ఇంటూరి రాజేష్‌ 

కందుకూరు : రాష్ర్టాన్ని రావణ కాష్టం చేస్తూ వైసీపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని టీడీపీ కందుకూరు నియోజకవర్గ యువనేత ఇంటూరి రాజేష్‌  విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిమీద దాడికి యత్నించిన ఘటన మర్చిపోకముందే ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపైనా, పార్టీ ముఖ్యనాయకుల ఇళ్లమీదా దాడులకు తెగబడడం చూస్తుంటే రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లనాటి బీహార్‌లా మారుస్తున్నారన్నారు. గవర్నర్‌ తగురీతిలో స్పందించి పరిస్థితులను చక్కదిద్దాలన్నారు. తెలుగుయువత రాష్ట్ర నాయకుడు బెజవాడ ప్రసాదు, నెల్లూరు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి అమ్మనబ్రోలు రమే్‌షలు ప్రభుత్వ పాలనను ఒక ప్రకటనలో ఖండించారు.

పీసీపల్లి : టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అల్లరి మూకలు చేసిన దాడికి నిరసనగా టీడీపీ శ్రేణులు మంగళవారం మండల కేంద్రమైన పీసీపల్లిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నేలపై కూర్చూని నిరసన తెలిపాయి. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ టీడీపీ ఉపాధ్యక్షులు గడ్డం బాలసుబ్బయ్య నాయకులు వేమూరి రామయ్య, కసిరెడ్డి హనుమారెడ్డి, బద్దిపూడి ఎబినేజర్‌, ఏసుదాసు, వేమూరి సుబ్బరాయుడు, వెలిది శ్రీను, ఏనుగంటి నాగేంద్రబాబు, ఏలూరి రాంభూపాల్‌, తాటికొండ శ్రీను ఉన్నారు. నేడు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బంద్‌ చేపడుతున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలు

కనిగిరి(హనుమంతునిపాడు) :రాష్ట్రంలో వైసీపీ పాలనలో అరాచకం తాండవిస్తుందని, శాంతిభద్రతలు దిగజారి ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు రక్షణే లేకుండా పోయిందని  టీడీపీ మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడిని ఆయన ఖండించారు. వెలిగండ్ల మండలంలోనూ నిరసన కార్యక్రమం జరిగింది.


Updated Date - 2021-10-20T06:28:26+05:30 IST