ఆక్రమణలు..ఆపై అద్దెల దందా..!

ABN , First Publish Date - 2021-10-25T05:35:08+05:30 IST

కంభం మండలంలోని మేజర్‌ పంచాయతీలలో ఆక్రమణల పర్వం సాగుతోంది.

ఆక్రమణలు..ఆపై అద్దెల దందా..!
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ గోడపక్కన ఏర్పాటు చేసిన బంకులు


ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేటు పెత్తనం 

వేలాది రూపాయల వసూళ్లు

చోద్యం చూస్తున్న పంచాయతీ, 

ఆర్‌అండ్‌బీ, కాలేజీ అధికారులు

కంభం, అక్టోబరు 24 : కంభం మండలంలోని మేజర్‌ పంచాయతీలలో ఆక్రమణల పర్వం సాగుతోంది. పలువు రు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని పక్కాగా షెడ్లు, బంకులు, రూములు నిర్మించి చిరువ్యాపారులకు అద్దెలకు ఇస్తున్నారు. కొందరు ఆక్రమణదారులు నయాదందాకు తెరతీస్తున్నారు. చిరు వ్యాపారుల నుంచి నెలసరి అద్దెల రూపంలో వేలాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. దీంతో కందులాపురం పంచాయతీకి రావలసిన ఆదా యానికి గండిపడుతున్నది. ఈ అద్దెల దందా విషయం అధికారులకు తెలిసినప్పటికీ నెలసరి మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కందులాపురం సెంటర్‌, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ కాంపౌండ్‌వాల్‌ వెంట, కాలేజీ ఎదురుగా, వై.జంక్షన్‌, ఆర్టీసి బ స్టాండ్‌ రోడ్డు, మెయిన్‌ బజార్‌ పంచాయతీ, ఆర్‌ అండ్‌ బీ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. అక్కడితో ఆగకుండా అ క్కడ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని బడ్డీకొట్ల వారికి, టీకొట్లకు, ఇతర చిరువ్యాపారులకు అద్దెలకు ఇస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. పంచాయతీ, ఆర్‌ అండ్‌ బీ స్థలాల్లో పంచాయతీవారే షె డ్లను, బంకులను ఏర్పాటు చేసి చిరువ్యాపారులకు అద్దెకు ఇచ్చిన వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ ఖాతాలో జమ చేసుకోవచ్చని వార్డుమెంబర్లే బహిరంగంగా  చెప్తున్నారు. అలా కాకుండా ఆక్రమణదారుల నుంచి నెలసరి మామూళ్లు తీసుకుంటూ వదిలి వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అద్దెల రూపంలో పంచాయతీకి రావలసిన లక్షల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల జోబుల్లోకి వెళ్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనో, నగదు తాయిలాలతోనో అధి కారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాల, ఉర్దూ పాఠశాలలన్నీ ఒకే కాంపౌండ్‌లో ఉన్నాయి. కాలేజీ గేటు వద్ద తప్ప మిగిలిన ప్రాంతం మొత్తం ఆక్రమించుకుని బంకులు ఏర్పాటు చేస్తున్నా, జంతువథ చేసి విక్రయిస్తున్నా కాలేజీ ప్రిన్సిపాల్‌ పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ, ఆర్‌ అండ్‌ బీ స్థలాల్లో నిర్మించిన దుకాణాలన్నీంటిపై సర్వే నిర్వహించి పంచాయతీ వేలం ప్రక్రియ నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా పంచాయతీ అధికారులు ఆదాయం పెంచే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కార్యదర్శి వివరణ

ఈవిషయంపై కార్యదర్శి బ్రహ్మయ్యను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా తాను ఎవరి దగ్గరా డబ్బులు వసూలు చేయడం లేదన్నారు. కాలేజీ వారు, ఆర్‌ అండ్‌ బీ అధికారులు కలిసి రావాలి. అలాగే రాజకీయ ఒత్తిళ్లు  మాపై లేకుండా ఉంటే పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా చేస్తామన్నారు.


Updated Date - 2021-10-25T05:35:08+05:30 IST