వినియోగంలోకి వచ్చేదెప్పుడు?
ABN , First Publish Date - 2021-06-22T04:29:10+05:30 IST
గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన సుజలధార పనులు పూర్తిస్థాయిలో జరగక ప్రారంభానికి నోచుకోలేదు.
వేసవి ముగుస్తున్నా
ప్రారంభంకాని సుజలధార
మినరల్ వాటర్ కోసం ఎదురు చూపు
అనంతసాగరం, జూన్ 21: గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన సుజలధార పనులు పూర్తిస్థాయిలో జరగక ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో గ్రామీణ ప్రజలకు మినరల్ వాటర్ అందని పరిస్థితి. గత ప్రభుత్వం సుజల ధార పనులకు శ్రీకారం చుట్టింది. అనంతసాగరం మండలానికి రూ.3.2 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా మండలంలోని 30 గ్రామాలకు మినరల్ వాటర్ అందించాలి. ఆ దిశగా చేపట్టిన పనులు జిల్లాలోని పలు మండలాల్లో పూర్తికాగా అనంతసాగరం లో నేటికి ఈ పథకం వినియోగంలోకి రాలేదు. నిర్వహణ ఏజన్సీ నిర్లక్ష్య దోరణితో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఈ పనులు 90 శాతం పూర్తి కాగా మిగిలిన పనులు పూర్తి చేయాల్సి ఉంది. వేసవిలో ఈ పథకం వినియో గంలోకి వస్తుందని సురక్షిత మినరల్ వాటర్ తాగవచ్చని భావించిన ప్రజల కు నిరాశే ఎదురైంది. రెండేళ్ల క్రితమే నీరు అందించాల్సిన గ్రామాలలో ట్యాంకులు ఏర్పాటు చేయగా అవి తుప్పు పట్టే స్ధితికి చేరుతున్నాయి. ఎంపీడీ వో కార్యాలయం వద్ద మదర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. నీటి శుద్ధి చేసే యంత్రాలు ప్లాంట్లో బిగించా రు. విద్యుత్ సరఫరాను తీసుకోవలసి ఉంది. ఈ పనులు పూర్తి చేసి ఈ పథకం త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.