పైపైకి భూగర్భజలం
ABN , First Publish Date - 2021-08-02T05:09:32+05:30 IST
నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనంల కారణంగా జిల్లాలో ఇటీవల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
17 మండలాల్లో పెరిగిన నీటిమట్టం
గతేడాదికన్నా 4.09 మీటర్ల అధికం
మూడు మండలాల్లో స్వల్పంగా లోటు
ఇప్పటికీ 30 శాతం లోటులో వర్షపాతం
నెల్లూరురూరల్, ఆగస్టు 1 : నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనంల కారణంగా జిల్లాలో ఇటీవల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో భూగర్భజలమట్టాలు పెరిగాయి. అన్నీ మండలాల్లోనూ ఓ మోస్తరు నుంచి చెప్పకోదగిన స్థాయిలో భూగర్భజలం మట్టం పెరిగింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే 4.09 మీటర్లు అధికంగా నమోదైంది. 17 మండలాల్లో 4 మీటర్లకు పైగా భూగర్భ జలమట్టం పైకిరాగా, కేవలం మూడు మండలాల్లో మాత్రం స్వల్పంగా లోటు నమోదైంది. జిల్లా సరాసరి వర్షపాతం జూన నుంచి ఆగస్టుకు లెక్కించగా 30 శాతం తక్కువుగానే నమోదైంది. ఇప్పటికీ నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతున్నది.ఈ క్రమంలో మిగిలిన వర్షపాతం కూడా నమోదు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నీరు పుష్కలం
సాగునీటి వనరుల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. పారుదల కాలువల్లో గంగ పరుగులు తీస్తున్నది. దీంతో ఎక్కడిక్కడ భూగర్భజలాలు పెరిగాయి.47 మండలాల్లో చిల్లకూరు, ముత్తుకూరు, టీపీగూడూరులు మినహా మిగతా మండలాల్లో ఎక్కువుగానే భూగర్భజలమట్టం నమోదైంది. 4 మీటర్ల కన్నా ఎక్కువుగా 17 మండలాల్లో నమోదు కావడం హర్షణీయమని వాతావరణ విభాగం విశ్లేషకులు అంటున్నా రు. జూన నుంచి ఆగస్టుకు సగటున 148.25 మి.మీ వర్షపా తం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 103 మి.మీ మాత్రమే నమోదు అయింది. ఇంకా 30 శాతం వర్షం కురవాల్సి ఉంది. భూగర్భజల మట్టం పెరగడం వల్ల మోటార్ల కింద వ్యవసాయానికి కలిసొస్తుందని భావిస్తున్నారు. జూనలో మొదలైన నైరుతి రుతుపవనాల ప్రభావం జిల్లాపై ఉండటంతో సెప్టెంబరు వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయని లెక్కకడుతున్నారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉండనుండడంతో 60 నుంచి 70 శాతం వర్షపాతం నమోదు అవుతుందని అధికారులు అంటున్నారు.
తాగునీటికి ఇబ్బంది లేదు..
జిల్లాలోని అన్ని మండలాల్లో భూగర్భ జలాలు పైకి రావడంతో తాగునీటికి ఇబ్బందులు రావని నిపుణులు చెబుతున్నారు. చిల్లకూరు, ముత్తుకూరు, టీపీగూడూరు మండలాల్లోనూ స్వల్పంగానే లోటు కనిపిస్తున్నా, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాల్లో డైరెక్ట్ పంపింగ్ స్కీమ్లు, వాటర్ ట్యాంకులకు ఎత్తిపోతల నీళ్లను తోడేందుకు ఇబ్బందులు లేవని అధికారులు చెప్తున్నారు.