కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలని వీఆర్ఏల ధర్నాలు
ABN , First Publish Date - 2021-07-13T04:11:03+05:30 IST
తమకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలంటూ వీఆర్ఏలు సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
![కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలని వీఆర్ఏల ధర్నాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921071210361591/07122021223938n16.gif)
నాయుడుపేట టౌన్, జూలై 12 : తమకు ప్రభుత్వం కనీస వేతనం రూ. 21 వేలు చెల్లించాలంటూ వీఆర్ఏలు సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సహాయకుల సంఘం మండల నాయకుడు పోలయ్య మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న వీఆర్ఏలకు కనీస వేతనం ఇచ్చి, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా వీఆర్ఏలకు న్యాయం జరగలేదన్నారు. వంఎటనే హమీని అమలు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దారు శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ముకుంద, పెంచలయ్య, బాబు, శ్యామలమ్మ, దివ్య, జమునమ్మ పాల్గొన్నారు.
ఓజిలి : స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరసన తెలిపారు. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు శంకరయ్య, ప్రధానకార్యదర్శి సాయిరామ్ మాట్లాడుతూ వీఆర్ఏలకు కనీస వేతనం రూ. 21 వేలు, ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని కోరారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా వర్తింపజేయాలని వారు డిమాండు చేశారు. అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అనంతరం తహసీల్దారు లాజరస్కు వినతిపత్రాన్ని అందజేశారు.
![](https://media.andhrajyothy.com/appimg/galleries/1921071210361591/07122021223952n22.gif)