వర్షంతో రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2021-12-10T03:10:47+05:30 IST
ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి మెట్ట మండలాల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువు

ఉదయగిరి, డిసెంబరు 9: ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి మెట్ట మండలాల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. సాగు చేసిన వరి, మినుము నీట మునిగి దెబ్బతిన్నాయి. ఊటలు పారుతున్న తరుణంలో గురువారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ వర్షంతో నీరు పారడంతో ఉన్న కొద్ది పాటి పంటలు సైతం దెబ్బతినే ఆస్కారం ఉందని వారు వాపోతున్నారు.
వర్షంతో రైతుల ఆందోళన
కలిగిరి, డిసెంబరు 9: మండలంలో గురువారం వర్షం పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకే మినుము, శనగ, పొగాకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. తిరిగి మళ్లీ వర్షాలు మొదలయ్యాయని, ఈ వర్షాలు విడవకుండా కురిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు.
వీకే పాడులో..
వరికుంటపాడు, డిసెంబరు 9: మండలంలో గురువారం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశంలో మేఘాలు కమ్ముకొని మోస్తారు వర్షం కురిసింది. రోజంతా ముసురు పట్టడంతో ప్రజలు నివాసాలకే పరిమితమయ్యారు. చలి తీవ్రత సైతం అధికమవడంతో పిల్లలు, వృద్ధులు బెంబేలె త్తిపోయారు.