మెట్టలో ఎడతెరపిలేని వర్షం
ABN , First Publish Date - 2021-10-30T03:24:21+05:30 IST
ఉదయగిరి మెట్ట ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఉదయగిరి ప్రాంతం దద్దరిల్లింది.
ఉదయగి, అక్టోబరు 29: ఉదయగిరి మెట్ట ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో ఉదయగిరి ప్రాంతం దద్దరిల్లింది. పల్లెల్లో రోడ్లు రొచ్చు రొచ్చుగా మారాయి. పలు గ్రామాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఉదయగిరి పట్టణంలో మురికి కాలువలు వర్షపు నీటితో పొంగిపొర్లాయి. కాలువల్లో చెత్తాచెదారం రోడ్లపై చేరి దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తహసీల్దారు, రిజిస్ట్రేషన్, సబ్ట్రెజరీ కార్యాలయ ప్రాంగణాలు వర్షపు నీటితో రొచ్చు రొచ్చుగా మారాయి. అలాగే ఎంపీడీవో, వ్యవసాయశాఖ కార్యాలయాలకు వెళ్లే మార్గంతో పాటు పలు రోడ్లపై వర్షపు నీరు నిల్వ చేరింది. ప్రస్తుతం సాగు చేస్తున్న వరికి ఈ వర్షం ఎంతో ఉపయోగకరమని రైతులు అంటున్నారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొర్లడంతోపాటు చెరువుల్లో ఓ మోస్తరు నీరు చేరింది. ఉరుములు మెరుపులతో పిడుగ ుపాటుకు విద్యుత్ షార్ట్సర్క్యూట్ ఏర్పడి ఉదయగిరి పట్టణంలోని షబ్బీర్ కాలనీ, నాగులబావివీధి, చాకలవీధి, దిలావర్భాయ్వీఽధి తదితర ప్రాంతాల్లో టీవీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్లు కాలిపోయాయి. చలిగాలులు అధికంగా వీస్తుండడంతో వృద్ధులు, మహిళలు నివాసాలకే పరిమితమయ్యారు. వరికుంటపాడు మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్, సెల్ఫోన్ సిగ్నల్స్ అంతరాయం ఏర్పడడంతో తాగునీటి పథకాలు మొరాయించాయి. రోజంతా వర్షం ప్రభావంతో పనులపై బయటకు వెళ్లలేక ప్రజలు నివాసాలకే పరిమితమయ్యారు. బోగోలు మండలం కలియుగ వైకుంఠంగా కొనియాడుతున్న ప్రసన్న వేంకటేశ్వరుడు వెలసిన కొండబిట్రగుంటలో శుక్రవారం కురిసిన కొద్దిపాటి వర్షానికి ప్రధాన రోడ్లు బురద మయంగా మారాయి. అనునిత్యం స్వామి అమ్మవార్లను దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల వాహనాలు బురదలో కూరుకు పోవడం, ద్విచక్ర వాహనాలు స్కిడ్ అవుతు ప్రమాదాలు తప్పి అవస్థలు పడ్డారు.
