ఇయర్ఫోన్సుతో పట్టాలపై నడక
ABN , First Publish Date - 2021-03-03T04:52:15+05:30 IST
యర్ఫోన్సు పెట్టుకుని సంగీతం వింటూ రైలు పట్టాలపై నిర్లక్ష్యంగా నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
రైలు ఢీకొని కార్పెంటర్కు గాయాలు
నెల్లూరు(క్రైం), మార్చి 2: ఇయర్ఫోన్సు పెట్టుకుని సంగీతం వింటూ రైలు పట్టాలపై నిర్లక్ష్యంగా నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం నగరంలోని విజయమహల్ గేటు సమీపంలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ ప్రభాకర్ సమాచారం మేరకు... బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇస్కపాళేనికి చెందిన షేక్ షఫీ ఉల్లా కార్పెంటర్గా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం నెల్లూరు నగరానికి వచ్చి ఆత్మకూరు బస్టాండు వద్ద బస్సు దిగాడు. చెవిలో ఇయర్ఫోన్సు పెట్టుకుని రైలు పట్టాలపై నడుచుకుంటూ విజయమహల్ గేటు వైపు వచ్చాడు. ఎదురుగా గూడ్సు రైలు వస్తున్నా గమనించలేదు. స్థానికులు పెద్దగా కేకలు వేసినా ఇయర్ఫోన్సు పెట్టుకుని ఉండటంతో వినిపించలేదు. రైల్వేగేటు సమీపంలోకి వచ్చేసరికి రైలు అతన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఆ యువకుడిని స్థానికులు దగ్గర్లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.