పల్స్పోలియో విజయవంతం
ABN , First Publish Date - 2021-02-01T05:37:06+05:30 IST
జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్పోలియో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 98.32 శాతం మందికి పోలియో చుక్కలు వేశారు.

తొలిరోజు 98.32 శాతం నమోదు
పోలియో రహిత దేశమే లక్ష్యం
ఈ మూడు రోజులు కరోనా టీకా వేయరు
కలెక్టర్ చక్రధర్బాబు
నెల్లూరు (వైద్యం)జనవరి 31 : జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్పోలియో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 98.32 శాతం మందికి పోలియో చుక్కలు వేశారు. మొత్తం 3,76,260 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని అధికారులు నిర్ణయించగా, ఇందులో 3,33,237 మందికి వేశారు. పల్స్పోలియోను కలెక్టర్ చక్రధర్బాబు నెల్లూరులోని యూకే నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలియో రహిత దేశమే లక్ష్యంగా పల్స్పోలియోను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 3067 పోలియో బూత్ల ద్వారా పోలియో చుక్కలు వేశామన్నారు. జిల్లాలో 0 నుంచి ఐదేళ్ల లోపు ఉన్న చిన్నారులు 3,76,260 మందిని గుర్తించామన్నారు. పోలియో చుక్కలు వేసే మూడు రోజులు కరోనా టీకా వేయటం జరగదన్నారు. కరోనా టీకాపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జేడీ డాక్టర్ రాజేంద్రప్రసాద్, డీఎంహెచ్వో డాక్టర్ రాజ్యలక్ష్మి, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.