ఓటీఎస్తో 3.3లక్షల మందికి శాశ్వత భూహక్కు
ABN , First Publish Date - 2021-11-10T05:15:49+05:30 IST
ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్తో జిల్లాలో 3.3లక్షల మందికి శాశ్వత భూహక్కు ప్రయోజనం కలుగుతుందని జేసీ విదేహ్ఖరే అన్నారు.
![ఓటీఎస్తో 3.3లక్షల మందికి శాశ్వత భూహక్కు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921110911440665/11092021234419n47.jpg)
డిసెంబర్ 21న హక్కు పత్రాల పంపిణీ
జేసీ విదేహ్ ఖరే
మనుబోలు, నవంబరు 9: ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్తో జిల్లాలో 3.3లక్షల మందికి శాశ్వత భూహక్కు ప్రయోజనం కలుగుతుందని జేసీ విదేహ్ఖరే అన్నారు. మండలంలోని మనుబోలు, కాగితాలపూరు సచివాలయాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో ఓటీఎస్ నమోదు 50శాతం మాత్రమే అయిందని నూరుశాతం ఎప్పటికీ పూర్తి చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలో ఓటీఎస్ కిందకు 4,444మంది వస్తారని, ఇప్పటికి 2,700 మందికి సంబంధించి మాత్రమే కొలతలు తీసి నమోదు చేశారన్నారు. రూ.10వేలు చెల్లిస్తే ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ కింద నిర్మించుకున్న ఇళ్లకు శాశ్వత భూహక్కు పేరుతో పట్టాలు ఇస్తుందన్నారు. ఈ నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు. డిసెంబరు 21న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి లబ్ధిదారులకు భూహక్కు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. ప్రస్తుతం గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి బిల్లులు అందుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, హౌసింగ్ డీఈ సత్యనారాయణ, ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.