భక్తుల కోసం ఉత్తర భారత యాత్ర
ABN , First Publish Date - 2021-07-30T05:30:00+05:30 IST
భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మాత వైష్ణో దేవి ఉత్తర భారత యాత్రను ఈ నెలలో ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిశోర్ తెలిపారు.
ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 6 వరకు
ఐఆర్సీటీసీ, ఆన్లైన్లో టికెట్ల బుకింగ్
రైల్వేశాఖ సికింద్రాబాద్ డీజీ కిశోర్
నెల్లూరు ( వెంకటేశ్వరపురం) జూలై - 30 : భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మాత వైష్ణో దేవి ఉత్తర భారత యాత్రను ఈ నెలలో ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిశోర్ తెలిపారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 6 వరకు ఈ యాత్ర ఉంటుందని తెలిపారు. ప్రధానంగా ఆగ్రా, మదుర , వైష్ణోదేవి , అమృత్సర్ , హరిద్వార్ , డిల్లీ తదితర ప్రాంతాల దర్శనానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులకు అన్ని వసతులు, భోజనాలు రైల్వేశాఖ చూసుకుంటుందన్నారు. 13 కోచ్లతో రైలు 550 భక్తులతో ప్రయాణమవుతుందన్నారు. టికెట్లు బుక్ చేసుకునే భక్తుల సంఖ్యను ఆధారంగా రైళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రేణుగుంట, నెల్లూరు, ఒంగోలు , విజయవాడ , గుంటూరు , ఖాజీపేట తదితర ప్రాంతాల మీదుగా యాత్ర సాగుతుందన్నారు. స్లీపర్ టికెట్ ( ఒకరికి ) రూ.10,400, ఏసీ 3టైర్ (ఒకరికి ) రూ.17,330గా టికెట్ ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. టికెట్లు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా , ఆన్లైన్లో సైతం అందుబాటులో ఉంటాయన్నారు. పూర్తి వివరాలకు 8287932312 , 9701360675లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విజయవాడ ఐఆర్సీటీసీ మేనేజర్ మురళీకృష్ణ , సికింద్రాబాద్కు చెందిన చీఫ్ మేనేజర్ పవన్ , నెల్లూరు స్టేషన్ సూపరింటెడెంట్ కుమార్ పాల్గొన్నారు.