మృత్యువాత పడుతున్నా వీడని నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2021-05-19T05:07:17+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మొదటి దశలో వృద్ధులపైనే ప్రధానంగా ప్రభావం చూపింది.
![మృత్యువాత పడుతున్నా వీడని నిర్లక్ష్యం](https://media.andhrajyothy.com/appimg/galleries/1921051811353943/05182021233637n56.gif)
కర్ఫ్యూ ఆంక్షలు, కొవిడ్ నిబంధనలు గాలికి
తగ్గని కేసులు, మరణాలు
జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా కట్టడి
నాయుడుపేట, మే 17 : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మొదటి దశలో వృద్ధులపైనే ప్రధానంగా ప్రభావం చూపింది. సెకండ్ వేవ్లో వృద్ధులతోపాటు యుకులనూ వదలడం లేదు. ఎంతో మంది కరోనా బారిన పడి ఆసుపత్రులపాలవుతున్నారు. పలువురు మృత్యు వాతప డుతున్నారు. ఆప్తులను పోగొట్టుకొని అల్లాడుతున్నారు. ఆర్థికంగా కుంగిపోతున్నారు. అయిన వారు మరణిస్తే అంత్యక్రియలు చేసేందుకు దూరంగా ఉంటున్న పరిస్థితి. కరోనా బారిన నుంచి రక్షణ పొందడానికి మాస్కులు, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం ఒక్కటే మార్గం. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం వీడటంలేదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు తమకు కావాల్సిన సరుకులను తెచ్చుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి మరుసటిరోజు 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటోంది. ఆ సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలి. కర్ఫ్యూ ఆంక్షలుగానీ, కొవిడ్ నిబంధనలు గానీ దాదాపు ఎవరూ పాటించడం లేదు. మాస్క్లు వాడినా భౌతికదూరం అసలు పాటించడం లేదు. గత ఏడాది కరోనా సమయంలో ప్రజలు నిబంధనలను కఠినంగా పాటించారు. ఫలితంగా కరోనా తాత్కాలికంగా తగ్గుముఖం పట్టింది. అజాగ్రత్తగా ఉండడం వల్ల మళ్లీ సెకండ్వే ఉధృతంగా ఉంది. ప్రజల్లో ఏమాత్రం నిర్లక్ష్యం తగ్గడం లేదు. కేసుల పరంపర కొనసాగుతోంది. మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దాంతో ప్రభుత్వం ఈనెల నుంచి 20 నుంచి ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు సమయం కేటాయించింది. ఆపై 10 నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. ఇకనైనా ప్రజలు స్వీయ రక్షణ పాటించి కరోనాను తరిమికొట్టేందుకు సిద్ధం కావాలి.