వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-04T05:05:10+05:30 IST

ఆమె ఉన్నత విద్యావంతురాలు. ఓ ప్రముఖ విద్యాసంస్థలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అత్తింటి వేధింపులు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో బలవన్మరణానికి ఒడిగట్టింది. ఈ విషాద ఘటన నెల్లూరులోని ఎన్‌టీఆర్‌నగర్‌ చర్చివీధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

వివాహిత ఆత్మహత్య
మానస భర్తను విచారిస్తున్న సీఐ (ఇన్‌సెట్‌)మానస మృతదేహం

లెక్చరర్‌గా పనిచేస్తూ డ్రైవర్‌తో ప్రేమ వివాహం

మనస్పర్థలతో బలవన్మరణం

అత్తింటి వేధింపుల వల్లేనని తల్లి ఫిర్యాదు


నెల్లూరు(క్రైం), సెప్టెంబరు 3: ఆమె ఉన్నత విద్యావంతురాలు. ఓ ప్రముఖ విద్యాసంస్థలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ అక్కడే డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అత్తింటి వేధింపులు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో బలవన్మరణానికి ఒడిగట్టింది. ఈ విషాద ఘటన నెల్లూరులోని ఎన్‌టీఆర్‌నగర్‌ చర్చివీధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

సేకరించిన సమాచారం మేరకు... ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాకిచర్ల గ్రామానికి చెందిన జే లక్ష్మికి ముగ్గురు పిల్లలు మానస(28), మౌనిక, మహేంద్ర  ఉన్నారు. లక్ష్మి కూలి పనులు చేసుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించింది. పెద్ద కుమార్తె మానస పద్మావతి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పూర్తి చేసి నెల్లూరులోని ధనలక్షీపురంలో ఉన్న నారాయణ విద్యాసంస్థలో జూనియర్‌ లెక్చరర్‌గా చేరింది. అక్కడే పనిచేస్తున్న వ్యాన్‌ డ్రైవర్‌ చినబాబుతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి వారిద్దరూ ఏడాది కిందట వివాహం చేసుకుని మాదరాజుగూడూరులో కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న కన్నతల్లి చేసేది లేక కుమార్తె వద్దకు వచ్చి తన బిడ్డను బాగా చూసుకోవాలని అల్లుడికి చెప్పి వెళ్లింది. అయితే వివాహం అయిన కొద్ది రోజులకే కట్నం కోసం అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. భర్త కూడా వారికి సహకరించడంతో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని మానస తన తల్లికి చెప్పి కన్నీటి పర్యంతమైంది. తల్లి కుమార్తెకు సర్దిచెప్పి ఓదార్చింది. కొంతకాలం క్రితం మానస, చిన్నబాబు దంపతులు రామ్‌నగర్‌కు, అక్కడి నుంచి రెండునెలల క్రితం ఎన్‌టీఆర్‌ నగర్‌ చర్చివీధికి కాపురం మార్చారు. మానస ఉద్యోగం మానేసి పోటీ పరీక్షలకు సిద్ధపడుతుండగా, చిన్నబాబు యాక్టింగ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీ గురువారం సాయంత్రం దంపతుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత చినబాబు ఇంటి వెనుక వైపు ఉన్న గదిలో ఉండగా మానస ముందు గదిలో ఫ్యాను కొక్కేనికి చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటికి ముందుగది వద్దకు వచ్చిన చిన్నబాబు తలుపులు తట్టినా మానస తీయకపోవడంతో కిటీకీలోనుంచి చూశాడు. మానస ఉరికి వేలాడుతుండటం చూసి చుట్టుపక్కల వారికి సమాచారమి చ్చి గది తలుపులు పగలగొట్టి మానసను కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతిచెంది ఉంది. ఈ విషయాన్ని ఫోన్‌ చేసి మానస తల్లికి తెలియజేశాడు.  గురువారం అర్ధరాత్రి స్థానికులు బాలాజీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మానస తల్లి లక్ష్మి శుక్రవారం ఉదయం నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమైంది. తన కుమార్తె మృతికి భర్త, అత్తమామ, ఆడబిడ్డలే కారణమని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో వారిపై ఇన్‌స్పెక్టర్‌ జీ మంగారావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-04T05:05:10+05:30 IST