వైష్ణవాలయాల్లో కుడారై వేడుకలు
ABN , First Publish Date - 2021-01-12T04:12:19+05:30 IST
ధనుర్మాసం 27వ రోజు సందర్భంగా నెల్లూరులోని వైష్ణవాలయాల్లో కుడారై పాశురం వేడుకలు సోమవారం జరిగాయి.
నెల్లూరు(సాంస్కృతికం), జనవరి 11 : ధనుర్మాసం 27వ రోజు సందర్భంగా నెల్లూరులోని వైష్ణవాలయాల్లో కుడారై పాశురం వేడుకలు సోమవారం జరిగాయి. మహాత్మాగాంధీనగర్ కృష్ణమందిరంలో 108 పాయసపు పాత్రల సమర్పణ, విశేష పూజలు భక్తులకు కనువిందు చేశాయి. అర్చకుడు వీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి, అమ్మవారికి అష్టోత్తర శతనామ పూజలు, తిరుప్పావై సేవ, శాత్తుమురై, కుంభహారతులు జరిగాయి. అనంతరం స్వామికి ఆరగింపు చేసిన పాయసపు పాత్రల్ని భక్తులకు అందచేశారు. ఈ కార్యక్రమాలను ధర్మకర్త సీహెచ్ వెంకటేశ్వర్లు, కమిటీ అధ్యక్షుడు బీ రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శి సుబ్బరామరాజు, కార్యదర్శులు కొండలరావు, ఎన్ రామమూర్తి, కోశాధికారి వీ శ్రీనివాసులు, భక్తులు రాజ్యలక్ష్మి, అరుణమ్మ, భానుమతి, తదితరులు పర్యవేక్షించారు. అలాగే తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, మూలాపేట వేణుగోపాలస్వామి ఆలయం, అష్టలక్ష్మి ఆలయం, పెద్ద బజారు రామమందిరం, స్టోన్హౌస్పేట గీతామందిరం, అయ్యప్పగుడి గురువాయురప్పన్ మహావిష్ణు ఆలయాల్లో తిరుప్పావై పూజలు, ప్రాకార ఉత్సవాలు జరిగాయి.
భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన
నగరంలోని చిన్నబజారు కోదండరామస్వామి ఆలయంలో సోమవారం ధనుర్మాస పూజల్లో భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన జరిగింది. అనంతరం స్వామివారికి పాయసపాత్రల ఆరగింపు చేశారు. ఆలయ చైర్మన్ ముప్పసాని రమేష్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.