అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడినా.. టీడీపీకి 36 శాతం విజయం
ABN , First Publish Date - 2021-02-26T05:35:06+05:30 IST
కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం మద్దతుతో సర్పంచులు, వార్డు మెంబర్లుగా పోటీచేసిన అభ్యర్థులు 36 శాతం మేర విజయం సాధించారని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, ఫిబ్రవరి 25: ఈనెల 21న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు టీడీపీ నాయకులు, ప్రజలు, ఓటర్ల మీద దౌర్జన్యాలకు పాల్పడినా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం మద్దతుతో సర్పంచులు, వార్డు మెంబర్లుగా పోటీచేసిన అభ్యర్థులు 36 శాతం మేర విజయం సాధించారని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం బుచ్చిరెడ్డిపాళెంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు చోట్ల టీడీపీ మద్దతుతో విజయం సాధించిన పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులను తప్పుదారి పట్టించి తమ పార్టీ అధికారంలో ఉందని వారిని మభ్యపెడుతూ వైసీపీ కండువాలు కప్పడం దుర్మార్గపు ఆలోచనలన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అన్నారు. అనంతరం జొన్నవాడ, కట్టుబడిపాళెం, ఇస్కపాళెం, తదితర గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లు కందికట్టు పెంచలయ్య, సోము నిర్మల, వైస్ సర్పంచు మైపాటి మస్తాన్, వార్డు మెంబర్లు కందికట్టు భవానమ్మ, కొత్తపట్నం ప్రసాద్, ముంగర మంజులమ్మ, కొత్తపట్నం శీనమ్మతోపాటు పలువురు వార్డు మెంబర్లను పూలమాలలు శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవీ. శేషయ్య, రైతు నాయకుడు నెల్లూరు ప్రభాకర్రెడ్డి, రామానాయుడు, చంద్రశేఖర్రెడ్డి, బాలాకుమార్, తాళ్ల నరసింహస్వామి, వుసురుపాటి ప్రసాద్, విల్సన్, వల్లూరు శ్రీనివాసులు, ఉమ్మయ్య స్వామి, పలువురు టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.