టీడీపీ కార్యకర్తల జోలికెళితే తాట తీస్తాం !
ABN , First Publish Date - 2021-12-27T04:46:49+05:30 IST
నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తల జోలికెళితే వారి తాట తీస్తామని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు హెచ్చరించారు.

వైసీపీ శ్రేణులను హెచ్చరించిన బొల్లినేని
సీతారామపురం, డిసెంబరు 26 : నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తల జోలికెళితే వారి తాట తీస్తామని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు హెచ్చరించారు. ఆయన ఆదివారం బసినేనిపల్లిలో పర్యటించి మండల ఐటీడీపీ కన్వీనర్ బత్తల వినయ్కుమార్ను పరామర్శించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ యువకుడు నిర్వహిస్తున్న స్థానిక మీ సేవా కేంద్రంపై అగ్రవర్ణాల వారు దాడి చేయడమే గాక, పోలీసుస్టేషన్లో పోలీసుల సమక్షంలోనే అతనిపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. పోలీస్స్టేషన్లోనే వైసీపీ శ్రేణులు రౌడీయిజం చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ అధికార పార్టీ వారికి వత్తాసు పలకడం ఎంత వరకు సమంజసమన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా అన్నింటిని తిరిగి చెల్లిస్తామన్నారు. నియోజకవర్గంలోని కొంత మంది పోలీసు అధికారులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వైసీపీ శ్రేణుల అడుగులకు మడుగులు ఒత్తుతూ ఎన్నో దుర్మార్గాలకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికార ఎమ్మెల్యే వైసీపీ శ్రేణుల అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ క్యాడర్ కూడా మరో రకంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటీఎస్ పేరుతో పేదలను పీడించడం తగదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే లబ్ధిదారులందరికీ ఉచితంగానే రిజిష్ట్రేషన్లు చేయిస్తామన్నారు. నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీలు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించకుండా సినిమా టికెట్ల ధరలపై పడటం విచారకరమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, నాయకులు చెంచలబాబుయాదవ్, మండల కన్వీనర్ ప్రభాకర్రాజు, చెన్నకేశవులు, వెంకటేశ్వర్లు, జాషువా, చంద్రారెడ్డి, రమేష్, బాలస్వామి, ఇజ్రాయిల్, మోహన్రెడ్డి, పెద్దగౌస్, తమ్మిశెట్టి రమణయ్య, పలు గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.