ప్రగతి పథంలోగూడూరు డివిజన్
ABN , First Publish Date - 2021-01-27T04:53:59+05:30 IST
గూడూరు డివిజన్ ప్రగతి పథంలో పయనిస్తోందని సబ్కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 72వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది.
గూడూరు, జనవరి 26: గూడూరు డివిజన్ ప్రగతి పథంలో పయనిస్తోందని సబ్కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. మంగళవారం స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 72వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. సబ్కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సబ్కలెక్టర్ గోపాలకృష్ణ, డీఎస్పీ రాజగోపాల్రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి స్వేచ్ఛాస్వాతంత్రాలను తీసుకొచ్చిన మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా యువత ముందడుగు వేసి దేశాభివృద్ధికి కృషిచేయాలన్నారు. డివిజన్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రైతులను, పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందించారు. పలు ప్రభుత్వ రంగ శాఖల్లో ఉత్తమ సేవలు కనబరిచిన ఉద్యోగులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, తహసీల్దార్ బాలలీలారాణి, ఎంపీడీవో నాగమణి, ఎంఈవో మదుసూదన్రావు, వివిధశాఖ అధికారులు, సుధాకర్రావు, మరళీమోహన్, నిరంజన్, సురేష్కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ కార్యాలయంలో..
స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సబ్కలెక్టర్ గోపాకృష్ణ, తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు లీలారాణి, స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజగోపాల్రెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఓబులేసు, రూరల్పోలీస్స్టేషన్లో సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ పుల్లారావు పతాకావిష్కరణలు చేశారు. రవాణాశాఖ కార్యాలయంలో ఆర్టీవో మల్లికార్జున్రెడ్డి పతాకావిష్కరణ చేశారు. ఎంవీఐ మురళీమోహన్, ఎఎంవీఐ శేషురెడ్డి, ఏవో ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పీఆర్క్లబ్లో క్లబ్ అధ్యక్షుడు కోడూరు మీరారెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీకిరెడ్డి మధుసూదన్రెడ్డి, కోశాధికారి పేటేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాసమూర్తి, ప్రభుత్వ పాటిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ వీపూరు విజయ్కుమార్ పతాకావిష్కరణలు చేశారు.పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో గణతంత్ర వేడుకులను నిర్వహించారు.
నాయుడుపేట : నాయుడుపేటలో మంగళవారం ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సరోజిని, స్థానిక కోర్టులో ఇన్చార్జి జడ్జి ఎస్కె ఫైజునిసా, తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు శ్రీనివాసులు, మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ కె. రవిబాబు, పోలీస్ స్టేషన్లో సీఐ వేణుగోపాల్రెడ్డి, మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో కార్యాలయ ఏవో రవికుమార్, న్యాయవాదులు వెందోటి పార్థసారధిరెడ్డి, హరనాథ్రెడ్డి, చదలవాడ కుమార్, దశయ్యమొదలియార్, కిశోర్కుమార్, చెంగయ్య, చెంచుకృష్ణయ్య, వెంకటకృష్ణయ్య, ఎస్ఐలు వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, డిప్యూటీ తహసీల్దారు శ్రావణ్, మధురాజు పాల్గొన్నారు.
సూళ్లూరుపేట : స్థానిక తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు కన్నంబాక రవి, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నరేంద్రకుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీపీఐ కార్యాలయంలో ఓగూరు కృష్ణయ్య, రోటరీహాల్ వద్ద రోటరీ అధ్యక్షురాలు సుంకర ప్రతిమ పతాకావిష్కరణలు చేశారు. స్థానిక మదరసాలో అక్బరీయా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వేడుకలను నిర్వహించారు.