ఇసుక మేటలు తొలగేనా?
ABN , First Publish Date - 2021-12-23T02:55:37+05:30 IST
ఇసుక మేటలు తొలగేనా.. ఏడాదిలోపు పంటలు సాగేనా..? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవ
పంటలు సాగయ్యేనా..
ఆందోళనలో రైతులు
పట్టించుకోని అధికారులు
బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు22: ఇసుక మేటలు తొలగేనా.. ఏడాదిలోపు పంటలు సాగేనా..? అని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడంలేదు. మండలంలోని మినగల్లు, పంచేడు నుంచి దామరమడుగు, పల్లిపాళెం వరకు రోడ్లు, కాలువల కరకట్టలు తెగి మట్టి, పొలాలన్నీ ఇసుక మేటలు వేశాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులు నేటికీ పంటలు సాగు చేసే అవకాశం లేకుండా పోయింది. వరదలకు మినగల్లు వద్ద సవకతోటలు కొట్టుకుని, ఆ పొలమంతా ఏటిలో కలిసిపోయింది. అయినా ఇంతవరకు ఆ పొలాలను అధికారులు పరిశీలించలేదు. జిల్లా కలెక్టర్, కేంద్ర బృందంతోపాటు సీఎం కూడా పర్యటనకు వచ్చారు. ఆ తరువాత రైతులను పట్టించుకున్నవారు కరువయ్యారు.
సాయం కోసం ఎదురుచూపు
పొలాల్లో వేసిన ఇసుక మేటలు తొలగించుకోలేక, గండ్లు పూడ్చుకోలేక సాయం కోసం రైతులు ఎదురుచూ స్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అధికారులతో సర్వే చేయించి ఇసుకమేటలు తొలగింపు, గండ్లు పూడ్చే చర్యలు చేపట్టాలని రైతాంగం కోరుతున్నది.
నష్టాల నమోదు
ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి సురేంద్ర రెడ్డిని వివరణ కోరగా, ఇసుక మేటలు 263 ఎకరాలు, కోతకు గురైంది 46 ఎకరాలు, నార్లు దెబ్బతింది 2,300 ఎకరాలు, విత్తనాలు వడ్లు పంపిణీ చేసింది 643 క్వింటాళ్లని తెలిపారు. పరిహారం కోతకు గురైన పొలం ఎకరాకు రూ.15వేలు, ఇసుక మేటలు వేసిన పొలంకు రూ. 4880 లుగా పరిహారం కోసం సర్వేచేసి నమోదు చేశామన్నారు.

