మతం మారిన ఎస్సీలకు సర్టిఫికెట్‌ ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2021-08-26T05:16:38+05:30 IST

మతం మారిన షెడ్యూల్డు కులాల వారికి ఎస్సీ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దని కేంద్ర సంచార జాతుల అభివృద్ధి బోర్డు సభ్యుడు తురక నరసింహం అధికారులకు సూచించారు.

మతం మారిన ఎస్సీలకు సర్టిఫికెట్‌ ఇవ్వొద్దు
అధికారులతో సమీక్షిస్తున్న తురక నరసింహం

ఎస్సీ, ఎస్టీల స్థితిగతులు మెరుగుపరచాలి

కేంద్ర వెల్ఫేర్‌ బోర్డు సభ్యుడు తురక నరసింహం

నెల్లూరు (వీఆర్సీ), ఆగస్టు 25 : మతం మారిన షెడ్యూల్డు కులాల వారికి ఎస్సీ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దని కేంద్ర సంచార జాతుల అభివృద్ధి బోర్డు సభ్యుడు తురక నరసింహం అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల స్థితిగతులు మెరుగుపడేలా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఆయా వర్గాలకు అందించాలని, వారికంటే వెనుకబడి ఉన్న సంచారజాతుల ప్రజలకూ అవి అందించేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై జిల్లా ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సమావేశానికి ఐటీడీఏ పీవో కనకదుర్గ భవానీ అధ్యక్షత వహించారు. డీఆర్వో చిన ఓబులేసు, ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, ఏ ఎస్పీ వెంకటరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ వంటి పథకాలు అటకెక్కాయని ఆవేదన వ్యక్తం చేశా రు. సమాజంలో కొన్ని వర్గాల చేతుల్లోనే భూములు ఉన్నాయన్నారు. దయనీయ స్థితి లో సంచార జాతుల వారు ఉన్నారని, అలాంటి వారికి సైతం సంక్షేమ ఫలాలు అం దించాలని ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. బేడ, బుడగ జంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని సూచించగా జిల్లాలో వారికి బీసీలుగా సర్టిఫికెట్‌లు ఇస్తున్నామని అధికారులు తెలియజేశారు. బీసీ జాబితాలో కొత్తగా ఎన్ని కులాలను చేర్చారు, వాటి జీవో నెంబర్లు చెప్పాలని నరసింహం కోరగా అధికారులు తమ వద్ద వివరాలు లేవని చెప్పడంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలని ఏఎస్పీ వెంకటరత్నంకు సూచించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జీవపుత్రకుమార్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి వై వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-26T05:16:38+05:30 IST