ఆధిక్యత చూపినా తగ్గిన మెజార్టీ
ABN , First Publish Date - 2021-05-03T04:18:44+05:30 IST
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఫలితాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఆధిక్యత కనపరచినా మెజార్టీ తగ్గింది.
![ఆధిక్యత చూపినా తగ్గిన మెజార్టీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆధిక్యత చూపినా తగ్గిన మెజార్టీ
61 శాతం నుంచి 41 శాతానికి పడిపోయిన వైసీపీ ఓట్లు
సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
సూళ్లూరుపేట, మే 2 : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఫలితాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఆధిక్యత కనపరచినా మెజార్టీ తగ్గింది. 2019 ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో 21 శాతం ఓట్లు తగ్గడం ఆ పార్టీ పరిస్థితిని ఎత్తిచూపుతోంది. ఈ నియోజకవర్గంలో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కంటే వైసీపీ అభ్యర్థి వరప్రసాద్కు 14,862 ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసీపీకి 51 శాతం, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి 42.6శాతం ఓట్లు వచ్చాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ 1,16,970(61శాతం) ఓట్లను పొందింది. ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 57,276(31.18 శాతం) ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 99,483 (41.33 శాతం) ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 56,120 (23.31 శాతం) ఓట్లు వచ్చాయి. వైసీపీ 20శాతం, టీడీపీ సైతం 8శాతం ఓట్లు కోల్పోయాయి. అధికారపార్టీ గతం కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని ప్రకటించినా రెండేళ్లలోనే 20శాతం ఓట్లు కోల్పోయింది. ఆ పార్టీకి దక్కడం భవిష్యత్తుపై జాగ్రత్తపడాలన్న విషయాన్ని ఆ పార్టీ నేతలకు ఎత్తిచూపుతుంది. అలాగే 2014లో 42 ఓట్లశాతం కలిగిన టీడీపీ 2019లో 32 శాతంకు, ప్రస్తుతం 23.31 శాతంకు దిగజారడం ఆపార్టీకి సైతం ఓ హెచ్చరికే కానుంది. ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి సమర్ధుడైన నేత లేకపోవడమే ఓట్ల శాతం నానాట తగ్గుతుందన్న విషయం అక్షరసత్యం. దానిని గుర్తించి అధిష్ఠానం జాగ్రత్తపడాల్సిన పరిస్థితి ఉంది.