చంద్రబాబు ఇంటిపై దాడి ముమ్మాటికీ తప్పు: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-09-18T18:40:54+05:30 IST

జిల్లాలోని సీపీఐ నేత రామకృష్ణ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నివాసంపై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

చంద్రబాబు ఇంటిపై దాడి ముమ్మాటికీ తప్పు: రామకృష్ణ

నెల్లూరు: జిల్లాలో సీపీఐ నేత రామకృష్ణ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నివాసంపై దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి సరైంది కాదని తెలిపారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి పూనుకోవడం ముమ్మాటికీ తప్పని... సీఎం దీనిని ఖండించాలని, వైసీపీ శ్రేణుల్ని అడుపుచేయాలని అన్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏమిచేస్తున్నారని ప్రశ్నించారు. నెల్లూరులో పాదయాత్ర చేస్తుంటే ఇంతమంది పోలీసులు ఉన్నారని...మరి అక్కడెందుకు లేరని నిలదీశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ నేత విమర్శించారు.




మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, విమర్శలు సైద్ధాంతికం ఉండాలని హితవుపలికారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా హోం మంత్రి ఏమి చేయలేని పరిస్థితిలో ఉండడం శోచనీయమన్నారు. అన్ని రంగాలను కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్ల చేతుల్లో పెడుతోందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 27న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని రామకృష్ణ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-09-18T18:40:54+05:30 IST