ఆశాజనకంగా మిరప

ABN , First Publish Date - 2021-05-06T05:19:13+05:30 IST

దిగుబడులతోపాటు ధర సైతం ఆశాజనకంగా ఉండడంతో మిరపరైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఆశాజనకంగా మిరప
ఎండుతున్న మిరపకాయలు

గతేడాదికన్నా పెరిగిన ధర

 కోట, మే 5 : దిగుబడులతోపాటు ధర సైతం ఆశాజనకంగా ఉండడంతో మిరపరైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోట, వాకాడు, చిట్టమూరు  మండలాల్లోని పలు ప్రాంతాల్లోని రైతులు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి దేశవాళీ, ఎల్‌అండ్‌టి-5  రకాల మిరప  విత్తనాలు సేకరించుకుని పెద్ద ఎత్తున సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతోపాటు  చాలినంత నీరు ఉండడంతో మంచి దిగుబడులు సాధించారు.  ఎకరాకు 6 నుంచి 6.5 క్వింటాళ్లు మాత్రమే వచ్చే దిగుబడులు ఈ సారి 9 నుంచి 9.5 క్వింటాళ్లకు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం క్వింటం మిరప ధర రూ.25 వేల దాకా పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. గతంలో ఇదే రకం కాయలు రూ.22 వేలు పలికాయి. కాగా, మార్కెట్‌లో ధర పడిపోయిందని చెబుతూ తక్కువ ధరకే కాయలు కొనుగోలు చేసుందుకు దళారులు యత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఐదారు నెలలు నిలువ చేస్తే మరింత ధర వచ్చే అవకాశం ఉండడంతో  కొన్ని గ్రామాల్లోని రైతులు స్టాకుని నిల్వ చేస్తున్నారు. 

Updated Date - 2021-05-06T05:19:13+05:30 IST