బుజ్జగింపులు.. బెదిరింపులు !

ABN , First Publish Date - 2021-02-01T05:32:17+05:30 IST

పంచాయతీలను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. రాజకీయ జిమ్మక్కులతో పోటీచేసే అభ్యర్థులను మభ్యపెడు తూ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేశాయి.

బుజ్జగింపులు.. బెదిరింపులు !

ఓ వైపు బేరసారాలు.. మరో వైపు హైజాకింగ్‌

నామినేషన్లు వేస్తే నగదు వస్తుందనే ఆఽశ

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

నచ్చనివారిని స్ర్కూటీనిలో తొలగించే యత్నం

అధికారులపై ఒత్తిడి

నేడు నామినేషన్ల పరిశీలన



కావలి, జనవరి31: పంచాయతీలను దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. రాజకీయ జిమ్మక్కులతో పోటీచేసే అభ్యర్థులను మభ్యపెడు తూ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేశాయి. తొలివిడత ఎన్నికలు జరుగుతున్న కావలి డివిజన్‌లోని 163 పంచాయతీ లకు, 1566 వార్డులకు బుజ్జగింపులు, బేరసారాలు, బెదిరింపుల మధ్య అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసి నామినేషన్లు వేయించారు. ఈ క్రమంలో టీడీపీతోపాటు బీజేపీ కూడా పలు చోట్ల తమ అభ్యర్థులను పోటీకి దింపింది. దీంతో అధికారపక్షం ఊహించిన ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా పోయింది. కొన్నిచోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కావలి డివిజన్‌లో 9 మండలాలకు జరుగుతున్న ఎన్నికలలో 4 మండలాలు కావలి నియోజకవర్గ పరిధిలో ఉండగా, 5 మండలాలు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాయి.


ఫలించని ఏకగ్రీవాలు


 ఈ రెండు నియోజకవర్గాల్లో  ప్రతిపక్షపార్టీలకు అవకాశం లేకుండా చేయాలని అధికారపార్టీ గ్రామస్థాయి నుంచి తన రాజకీయ జిమ్మక్కులను ఉపయోగించింది. ఎక్కువగా కావలి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎవరు పోటీచేస్తారనే విషయం ముందుగానే తెలుసుకుని వారిని తొలుత బుజ్జగించి  పోటీచేయకుండా ఉంటే మీకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని ఆశ చూపించారు. ముఖ్యంగా అధికారపార్టీలోనే అనేక చోట్ల రెండు వర్గాలు పోటీలు పడగా, వారిలో ఒక వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నాలు చేపట్టారు. వారు విననిచోట బేరసారాలు, బెదిరింపులు, చివరకు డబ్బు లు ఆశ చూపించారు. అలాగే ప్రతిపక్ష పార్టీల తరుపున పో టీ చేసే అభ్యర్థులను మభ్యపెట్టి వారిని బెదిరించే ప్రయత్నా లు కూడా చేశారు. రిజర్వేషన్లు ఉన్న పంచాయతీలలో ఒకరు ఎంపిక చేసుకున్న అభ్యర్థులను మరొకరు హైజాక్‌చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి కొన్ని చోట్ల రిజర్వేషన్‌ పంచాయతీలలో పట్టు కలిగిన నేతలకు డిమాండ్‌ పెంచి సర్పంచుకు పోటీచేసే వారికి రూ.4లక్షలు, వార్డుకు పోటీచేసే వారికి రూ. లక్ష  ఇస్తామని చెప్పి అధికారపార్టీ నామినేషన్లు వేయించిన సంఘటనలు ఉన్నాయి. కాగా నామినేషన్లు వేస్తే అనంతరం ఎవరైనా డబ్బులు ఇస్తే విరమించుకోవచ్చనే  ఆశతో కొందరునేతలు కూడా నామినేషన్లు వేసినట్లు ప్రచారం సాగుతోంది.


పనిచేయని బేరసారాలు, బెదిరింపులు


అధికారపార్టీ నాయకులు ప్రతిపక్షాలను పోటీచేయకుండా చేయాలనే ఉద్దేశంతో ఎన్ని జిమ్మక్కులు వేసినా అవి ఫలించలేదు. కావలి నియోజకవర్గంలో కొన్ని పంచాయతీల లో ఏకగ్రీవం చేయాలనే లక్ష్యంతో వారిని పిలిపించి తొలుత బుజ్జగించినా ప్రయత్నంలేక పోవటంతో ఆ తర్వాత తాము తలచుకుంటే నామినేషన్‌ వేయకుండా అడ్డుకోగలమని బెదిరింపుధోరణిలో మాట్లాడినట్లు ప్రచారం ఉంది. చివరకు వారు నామినేషన్‌కు సిద్దం కాగా వార్డులలో పోటీచేసేందుకు అభ్యర్థులు దొరకకుండా చేయాలనే ప్రయత్నాలు చేశారు. కావలి మండలంలోని ఒక పంచాయతీలో చివరకు గిరిజనులు ఉన్న ప్రాంతంలో వార్డుకు పోటీచేయకుండా చేయాలని వారిని మభ్యపెట్టి వారి ఆదార్‌కార్డులన్నింటిని  తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉదయగిరి నియోజకవర్గంలో ఓ ఎస్టీ పంచాయతీలో సర్పంచు అభ్యర్థిని ఒక వర్గం వారు ఎంపిక చేసుకోగా ప్రత్యర్థి వర్గం వారు ఆ అభ్యర్థిని తీసుకెళ్లి వారి తరుపున నామినేషన్లు వేయించినట్లు తెలిసింది. 


నేడు పరిశీలన


కాగా సోమవారం జరిగే స్ర్కూటినీపై అధికారపార్టీ నేతలు దృష్టిపెట్టారు.అధికారపార్టీ నుంచి వేసిన రెబల్స్‌ను, ప్రతిపక్షాలలో నచ్చని అభ్యర్థులను ఏదో విధంగా స్ర్కూటినీలో తొల గింపచేసేందుకు అధికారులపై అధికారపార్టీ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకునే దానికన్నా స్ర్కూటినీలో గుట్టు చప్పుడు లేకుండా ఏదో ఒక కారణం చూపించి కొందరిని ఎత్తివేయటం సులభతరమని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. నామినేష న్ల కేంద్రాల్లో ఉన్న స్టేజి-1 అధికారులంతా ఎన్నికల నియమా వళి మేరకు నడుచుకుంటున్నారు. కాబట్టి వారితో కాకుండా ఉన్నతాధికారులనుంచి ఒత్తిడి తెప్పించి అవకాశం ఉన్నంత వరకు స్ర్కూటినీలో తొలగింపుచేయాలనే ప్రయత్నాలు జరు గుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల కమిషన్‌ నిఘా ఎక్కువగా ఉండటంతో    అధికారులంతా మనం తప్పుచేసి తమ ఉద్యోగులకు ముప్పు ఎందుకు తెచ్చుకోవా లనే భావనలో ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో అధికారపార్టీ నేతలు స్ర్కూటినీలో ప్రత్యర్థుల అభ్యర్థుల తొలగింపునకు చేస్తున్న ఒత్తిడిలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చర్చనీయాంశంగా ఉంది.

Updated Date - 2021-02-01T05:32:17+05:30 IST