నేడు రాష్ట్రవ్యాప్త బంద్
ABN , First Publish Date - 2021-03-05T04:57:27+05:30 IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, పలు పార్టీలు, ప్రజాసంఘాలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడుతున్నాయి.
ఆగనున్న ఆర్టీసీ బస్సులు
ప్రైవేట్ పాఠశాలలు మూసివేత
బంద్కు ప్రభుత్వం సహకారం
టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతు
నెల్లూరు (వైద్యం), మార్చి 4 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, పలు పార్టీలు, ప్రజాసంఘాలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్త బంద్ చేపడుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపు మేరకు జిల్లాలోనూ బంద్ను పటిష్టంగా చేపట్టాలని నిర్ణయించారు. వామపక్షాలతోపాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బంద్లో పాల్గొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు తిరగవని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాలు కూడా బంద్కు మద్దతు ప్రకటించి పాఠశాలలను మూసివేస్తున్నాయి. ఇదిలా ఉంటే నెల్లూరు నగరంలో ఈ బంద్ను విజయవంతం చేసేలా వామపక్షాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆత్మకూరు బస్టాండ్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు, ఆర్టీసీ నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు కార్మిక సంఘాలు ప్రదర్శన చేపట్టనున్నాయి. అంబేద్కర్ బొమ్మ వద్ద ఆందోళన కార్యక్రమం జరుగుతుందని ఆయా వర్గాలు ప్రకటించాయి.