పర్మినెంట్ చేయాలని ఆశా వర్కర్ల నిరసన
ABN , First Publish Date - 2021-05-11T03:37:37+05:30 IST
తమను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ ఆఽధ్వర్యంలో సోమవారం పాతూరు ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కావలిటౌన్, మే 10: తమను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ ఆఽధ్వర్యంలో సోమవారం పాతూరు ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పీ పెంచలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులను పట్టించుకోవడం లేదని, కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారిని పర్మినెంట్ చేయకపోవడం దారుణమన్నారు. పైగా సచివాలయాలకు తరలించి పనిభారాన్ని పెంచడం శ్రమదోపిడీ అన్నారు. నెలసరి జీతం పదివేలు కూడా ఇవ్వడం లేదని, పింఛన్ బెనిఫిట్స్ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24 జరిగే దేశవ్యాప్త ఒక్క రోజు సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. యూనియన్ అధ్యక్షురాలు వసుంధర దేవి, గాయత్రి, గ్రేసమ్మ, వెంకటలక్ష్మి, జానకి తదితరులు పాల్గొన్నారు.