మండలాల్లోనూ వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-01-22T05:58:06+05:30 IST
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య 27 నుంచి 56కు పెంచారు. మండలాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రారంభించారు.
- ఆరో రోజు 1,064 మందికి వ్యాక్సిన్
కర్నూలు(హాస్పిటల్), జనవరి 21: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య 27 నుంచి 56కు పెంచారు. మండలాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రారంభించారు. గురువారం 6వ రోజు 4,796 మంది రిజిస్ర్టేషన్ చేయించుకోగా 1,064 మంది హెల్త్కేర్ వర్కర్లకు టీకాను వేశారు. బనగానపల్లె సీహెచ్సీలో 153 మందికి 145 మంది, నంద్యాల పీపీయూలో 278 మందికి 115 మంది, డోన్ సీహెచ్సీలో 255కి 71 మంది, కల్లూరు పీహెచ్సీలో 55 మంది, తిమ్మాపురం పీహెచ్సీలో 50 మంది టీకాలు వేయించు కున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ శుక్రవారం నుంచి నాలుగు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రారంభమవుతుందని డీఐవో డా.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఏడో రోజైన శుక్రవారం నుంచి శాంతిరాం మెడికల్ కాలేజి (నంద్యాల), విశ్వభారతి మెడికల్ కాలేజి (పంచికలపాడు)తో పాటు కర్నూలు మెడికవర్, గౌరీగోపాల్ హాస్పిటల్లోని వైద్య సిబ్బందికి మాత్రమే టీకా వేయనున్నారు. ప్రైవేటు సెక్టార్లో రిజిస్ర్టేసన్ చేయించుకున్న వారికి మాత్రమే టీకా వేస్తారు.
ఆరు పాజిటివ్ కేసులు
జిల్లాలో గత 24 గంటల్లో 4,872 కరోనా పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్గా తేలింది. ఇప్పటి వరకు 60,757 మందికి కరోనా సోకింది. కోలుకున్న వారి సంఖ్య 60,209. చికిత్స పొందుతున్న వారు 61 మంది ఉన్నారు.