‘గృహ హక్కు పథకాన్ని వినియోగించుకోండి’

ABN , First Publish Date - 2021-10-20T05:23:02+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేదలకు వరం లాంటిదని, అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జేసీ (హౌసింగ్‌) నారపురెడ్డి మౌర్య సూచించారు.

‘గృహ హక్కు పథకాన్ని వినియోగించుకోండి’

 కర్నూలు(కలెక్టరేట్‌), అక్టోబరు 19: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేదలకు వరం లాంటిదని, అర్హులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జేసీ (హౌసింగ్‌) నారపురెడ్డి మౌర్య సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (వన్‌ టైం సెటిల్‌మెంట్‌)పై మంగళవారం జేసీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా జిల్లాలో 4.45 లక్షల మంది పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. పథకం ద్వారా లబ్ధిదారులు సొంత ఇంటి హక్కుదారులవుతారని తెలిపారు. అలాగే ల్యాండ్‌ పైన వారికి పూర్తి రైట్స్‌ కూడా ఉంటాయన్నారు. 1983 నుంచి 2011 వరకు ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను ప్రభుత్వంలో కుదవ పెట్టిన, తనఖా నుంచి విడిపించుకునేలా వన్‌టౌమ్‌ సెటిల్‌మెంట్‌ అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయని, బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని తెలిపారు. అర్హుల జాబితా కన్సాలిడేట్‌ చేసిన తర్వాత డిజిటల్‌ అసిస్టెంట్‌లు సోషల్‌ ఆడిట్‌ కూడా చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఎటువంటి అబ్జెక్షన్‌ ఉన్నా పరిష్కరించనున్నట్లు తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు, వాలంటీర్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, సమన్వయంతో ప్రిపరేటరీ వర్కులన్నీ డిసెంబరు మొదటి వారానికల్లా పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్లాబ్‌ రేట్స్‌ నాలుగు కేటగిరీలుగా ఉంటాయనిన్నారు. కేటగిరి-ఏ కింద పట్టా తీసుకున్నవారు.. ఇల్లు కట్టుకున్న వారు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి రూరల్‌ ప్రాంతంలో రూ.10వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌లలో రూ.20వేలు చెల్లిస్తే ఓటీఎస్‌ వర్తిస్తుందని జేసీ తెలిపారు. కేటగిరి-బి కింద పట్టి ఉండి, ఇల్లు కట్టుకుని, హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకుని, ఎవరికైనా ఇంటిని అమ్మేసి ఉంటే.. రూరల్‌ ప్రాంతంలో రూ.20వేలు, మున్సిపాలిటీల్లో రూ.30వేలు, కార్పొరేషన్‌లలో రూ.40వేలు జమ చేసి ఓటీఎస్‌ కింద లబ్ధి పొందవచ్చని తెలిపారు. కేటగిరి-సి కింద పట్టా మాత్రమే తీసుకుని.. రుణాలు తీసుకోకుండా వాళ్లే ఆ స్థలంలో ఉంటే అలాంటి కేటగిరీ వారికి చార్జీలు ఉండవని తెలిపారు. కేటగిరి-డి కింద పట్టా తీసుకున్నవారు ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మినప్పుడు ఆ స్థలంలో ఇతరులు అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటే.. అలాంటి వారికి రూరల్‌ ప్రాంతంలో రూ.10వేలు, మున్సిపాలిటీల్లో రూ.15వేలు, కార్పొరేషన్‌లలో రూ.20వేలు జమ చేస్తే వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. హౌసింగ్‌ పీడీ వెంకటనారాయణ, హౌసింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-10-20T05:23:02+05:30 IST