రేపు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-05-30T06:23:29+05:30 IST
జిల్లాలో రెండు మెడికల్ కాలేజీల భవన నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ సోమవారం శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. నంద్యాల, ఆదోనిలో వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది.
![రేపు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం
- జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
నంద్యాల/ఆదోని, మే 29: జిల్లాలో రెండు మెడికల్ కాలేజీల భవన నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ సోమవారం శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. నంద్యాల, ఆదోనిలో వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. ఈనెల 31న వర్చువల్ విధానంలో సీఎం శంకుస్థాపన చేస్తారని జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో శంకుస్థాపన పనులను సబ్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్లతో నంద్యాల వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. సీఎం శంకుస్థాపన వేదిక, ఎల్ఈడీ స్ర్కీన్ తదితర ఏర్పాట్ల గురించి అధికారులతో జేసీ చర్చించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జర్మన్ హేంగర్ల షెడ్తో నిర్మించిన కొవిడ్ తాత్కాలిక ఆసుపత్రిని జేసీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్కుమార్, డిప్యూటీ డీఎం హెచ్వో డాక్టర్ అంకిరెడ్డి, తహసీల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాగలాపురం గ్రామం దగ్గర 59.45 ఎకరాల విస్తీర్ణంలో ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని ఆర్డీవో రామకృష్ణారెడ్డి తెలిపారు. 59.45 ఎకరాల విస్తీర్ణంలో రూ.475 కోట్లు వెచ్చించి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.