ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే సహించం
ABN , First Publish Date - 2021-10-22T05:26:35+05:30 IST
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలని చూస్తే సహించేదిలేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు తోటమద్దులు అన్నారు.
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి
నంద్యాల టౌన్, అక్టోబరు 21: ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలని చూస్తే సహించేదిలేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు తోటమద్దులు అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ ఆర్చి సర్కిల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఢిల్లీలో 300 రోజులకుపైగా రైతులు పోరాటం చేస్తున్నారని, 700మంది రైతులు మరణించినా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయకపోవడం దారుణమని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులను బానిసలుగా చేయాలని చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు.