ఆక్సిజన్ కొరత లేదు
ABN , First Publish Date - 2021-05-17T05:22:41+05:30 IST
నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితులకు ఎలాంటి ఆక్సిజన్ కొరత ఉండబోదని సబ్ కలెక్టర్ కల్పనాకుమారి అన్నారు.
- సబ్ కలెక్టర్ కల్పనాకుమారి
నంద్యాల, మే 16: నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితులకు ఎలాంటి ఆక్సిజన్ కొరత ఉండబోదని సబ్ కలెక్టర్ కల్పనాకుమారి అన్నారు. ఆదివారం గ్రీన్కో ఫౌండేషన్ రూ.20 లక్షలు విలువ చేసే 13 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, 10 ఆక్సిజన్ సిలిండర్లు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి విరాళంగా అందజేశారు. ఆసుపత్రికి తీసుకు వచ్చిన ఆక్సిజన్ సామగ్రిని సబ్ కలెక్టర్ కల్పనాకుమారికి గ్రీన్కో ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసులు, ఏఎస్ నాయుడు అప్పగించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కల్పనాకుమారి మాట్లాడుతూ గ్రీన్కో సంస్థ అందజేసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్కు విద్యుత్ సరఫరా అందించినట్లైతే నిరంతరం ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో ఇప్పటికే 6 కేఎల్ సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశామని, అదనంగా 50 ఆక్సిజన్ రీఫిల్స్ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కరోనా బాధితులకు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉండబోదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వాసుపత్రి సిబ్బంది, గ్రీన్కో ఫౌండేషన్ ప్రతినిధి కంచెర్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.