మహిళా చైతన్యంతోనే సీమ హక్కుల సాధన
ABN , First Publish Date - 2021-12-31T05:33:42+05:30 IST
మహిళల చైతన్యంతోనే రాయలసీమ హక్కులు సాధించుకోగలమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.
![మహిళా చైతన్యంతోనే సీమ హక్కుల సాధన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల, డిసెంబరు 30: మహిళల చైతన్యంతోనే రాయలసీమ హక్కులు సాధించుకోగలమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. గురువారం నంద్యాల మండలం కానాల గ్రామంలో సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. దశాబ్దాలుగా సాగునీరు, తాగునీరు విషయంలో సీమ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. ఏడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సీమలో నిర్మాణంలో ఉన్న హంద్రీ - నీవా, గాలేరు - నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, సిద్ధాపురం ఎత్తిపోతలు, ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టులను ఏపీ విభజన చట్టం అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొనిందని అన్నారు. అయితే విభజన చట్టం ద్వారా ఏర్పడిన కృష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్లో ఈ ఏడు ప్రాజెక్టులను అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొనడం అన్యాయమని అన్నారు. ఆరు నెలల్లో ఈ ఏడు ప్రాజెక్టులకు అనుమతులు పొందకపోతే, చుక్కనీరు కూడా విడుదల చేయమని కృష్ణా నోటిఫికేషన్లో పేర్కొనడం ఆవేదనకు గురి చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సమస్యను పరి ష్కరించడానికి సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ హక్కుల సాధన కోసం 4జిల్లాల్లో ప్రజలను జాగృతం చేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు పొదుపు, ఐక్యసంఘాల సమావేశాల్లో సాగు, తాగునీటిపై చర్చించి అవగాహన పెంచుకోవాలన్నారు. సాగునీటి సాధన సమితి నాయకులు ఎన్.సుధాకర్రావు, రమణారెడ్డి, భాస్కర్రెడ్డి, శ్రీనివాస పాండే, ప్రతా్పరెడ్డి, అపర్ణ, రామచెన్నమ్మ, సునీత, జమాలమ్మ, వెంకట సుబ్బమ్మ, నాగమ్మ, కృష్ణవేణి, మస్తానమ్మ, లహరి పాల్గొన్నారు.