‘విద్యార్థుల జోలికెళ్తే గుణపాఠం తప్పదు’
ABN , First Publish Date - 2021-11-10T05:28:30+05:30 IST
విద్యార్థుల జోలికెళ్తే గుణపాఠం తప్పదని టీడీపీ కర్నూలు లోక్సభ నియజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర కుమార్, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్, ఉపాధ్యక్షుడు పేరపోగు రాజు, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
![‘విద్యార్థుల జోలికెళ్తే గుణపాఠం తప్పదు’](https://media.andhrajyothy.com/appimg/galleries/192111091155291/11092021235639n93.jpg)
కర్నూలు(అగ్రికల్చర్), నవంబరు 9: విద్యార్థుల జోలికెళ్తే గుణపాఠం తప్పదని టీడీపీ కర్నూలు లోక్సభ నియజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర కుమార్, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్, ఉపాధ్యక్షుడు పేరపోగు రాజు, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. అనంతపురంలో శాంతియుతంగా విద్యార్థులు సాగిస్తున్న నిరసన కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు పోలీసులు కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించి విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమని అన్నారు. ఈ టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో కర్నూలులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ పోలీసు యంత్రాంగాన్ని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కాజేయాలని చూస్తే ఊకుబోమని హెచ్చరించారు. విద్యార్థులకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, జిల్లా మీడియా ఇన్చార్జి చంద్రకాంత్, మోతీలాల్, సనా, ఇలియాజ్ పాల్గొన్నారు.
కర్నూలు(ఎడ్యుకేషన్): అనంతపురంలోని ఎస్ఎస్వీఎన్ విద్యాసంస్థల విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండిస్తూ మంగళవారం జిల్లాలో ఏఐఎస్ఎఫ్, ఏఐడీఎస్వో, ఏఐవైఎఫ్, డీఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు వేర్వేరుగా మంగళవారం నిరసనలు తెలియజేశారు. విద్యార్థి నాయకులు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను కాజేసేందుకే ప్రభుత్వం కుట్ర పనుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వ విదానాలను వ్యతిరేకించి ఆందోళనలు చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు ఝులుం, లాఠీచార్జ్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. కార్యక్రమాల్లో విద్యార్థి సంఘాల నాయకులు, డీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు, రాజు, క్రిష్ణ, సూరి, ఏఐడీఎస్వో రాష్ట్ర కార్యదర్శి హరీష్ కుమార్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి సూర్య, ప్రతాప్, ఇంతియాజ్, మునిస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆనంద్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు(అర్బన్): ఎస్ఎస్బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులపై లాఠీ చార్జీ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు నాగమద్దిలేటి డిమాండ్ చేశారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో కన్వీనరు మాధవ శంకర్, జిల్లా నాయకులు సుంకన్న, ఏఎస్ఏ అధ్యక్షులు మధుకృష్ణ, రాజా, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
పత్తికొండ టౌన్: అనంతపురంలో విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, అల్తాఫ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి నజీర్, నాయకులు విష్ణు, యువరాజ్, మహమ్మద్; కిరణ్, దస్తగిరి, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
డోన్(రూరల్): శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై లాఠీలతో చార్జ్ చేసి గాయపరిచిన అనంతపురం పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్న డిమాండ్ చేశారు. పట్టణంలోని పాతబస్టాండులో ధర్నా చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోహర్, మద్దిలేటి, రవి, హరినాథ్, ఏఐవైఎఫ్ నాయకులు, రాజేంద్ర, నాగరాజులు పాల్గొన్నారు. అలాగే ఏబీవీపీ జిల్లా హాస్టల్ విభాగ్ కన్వీనర్ బానాల హనుమంతు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని డీవైఎఫ్ఐ కార్యాలయంలో డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి నక్కి హరి మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలల పరిరక్షణ కోసం ఉద్యమించాలన్నారు. అనంతపురంలో జరిగిన సంఘటనకు పోలీసులు బాద్యత వహించాలన్నారు. సమావేశంలో డీవైఎఫ్ఐ మండల అధ్యక్షులు హరీఫ్ భాషా, నాయకులు వెంకటేష్, పవన్, రాజశేఖర్ పాల్గొన్నారు.
ప్యాపిలి: అనంతపురంలో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం హేయమైన చర్య అని జిల్లా ఏఐవైఎఫ్ నాయకులు పులిశేఖర్ విమర్శించారు. ప్యాపిలిలో ఆందోళన చేపట్టారు. నాయకులు రామక్రిష్ణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.