చంద్రబాబును కలిసిన సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2021-10-30T04:46:53+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును పార్టీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన ధర్మవరం సుబ్బారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
డోన్, అక్టోబరు 29: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును పార్టీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన ధర్మవరం సుబ్బారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం హైదరాబాదు నుంచి డోన్కు ఆయన వస్తున్నారు. నూతన ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డోన్ పట్టణంలో వీధులన్నీ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. పట్టణంలోని ఆయన నివాసం వద్ద టీడీపీ యువనాయకుడు గౌతమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.
డోన్పై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు ఐదు రోజుల క్రితం కేఈ కుటుంబంలోని ముఖ్య నాయకుడితో మాట్లాడినట్లు సమాచారం. పార్టీ ఇన్చార్జి బాధ్యతలపై గంట పాటు చర్చించినట్లు తెలిసింది. దీంతో ధర్మవరం సుబ్బారెడ్డి పేరును ప్రతిపాదించడంతో చంద్రబాబు ఆమోదం తెలిపారు. టీడీపీ డోన్ ఇన్చార్జిగా ధర్మవరం సుబ్బారెడ్డిని నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.