ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు
ABN , First Publish Date - 2021-02-02T05:01:54+05:30 IST
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు.

- ఎస్పీ ఫక్కీరప్ప
- పలు గ్రామాల్లో పర్యటన
బనగానపల్లె, ఫిబ్రవరి 1: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. సోమవారం బనగానపల్లె, యాగంటిపల్లె పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి సమస్యాత్మక గ్రామమైన యనకండ్ల గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు, ఇతర వివరాలను సీఐ సురేశ్కుమార్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. బనగానపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయం ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ మొదటి దశ నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ముగిసిం దన్నారు. అలాగే మిగతా విడతల నామినేషన్లు కూడా ప్రశాంతంగా నామినేషన్లు వేసుకునేందుకు పోలీస్ యంత్రాంగం పని చేస్తోందన్నారు. బనగానపల్లె పర్యటనలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్బందోబస్తు ఏర్పాట్లను బనగానపల్లె సీఐ సురేశ్కుమార్రెడ్డి, ఎస్ఐ మహేశ్ను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వ్యాక్సిన్, ఎన్నికలు కూడా సమన్వయంతో జరుగుతాయన్నారు. ఎస్పీ వెంట బనగానపల్లె సీఐ సురేశ్కుమార్రెడ్డి, ఎస్ఐలు మహేశ్కుమార్ ఉన్నారు.
అవుకు: ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. సోమవారం అవుకు పోలీస్ స్టేషన్కు చేరుకొని శాంతిభద్రతలపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. అవుకు మండలం లో సమస్యాత్మక గ్రామాలైన చనుగొండ్ల, చెన్నంపల్లె, చెర్లోపల్లె, కాశీపురం, శింగనపల్లె, రామాపురం, సుంకేసుల, అవుకు, కునుకుంట్ల, మంగంపేట, వేములపాడు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఎస్పీ వెంట డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, బనగానపల్లె సీఐ సురేష్కుమార్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి ఉన్నారు.
కోవెలకుంట్ల: మండలంలోని భీమునిపాడు గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని, పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ ఫక్కీరప్ప ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ ఫక్కీరప్ప విలేకరులతో మాట్లాడుతూ రెండో విడత ఎన్నికలు 13 మండలాల్లో 240 పంచాయతీ గ్రామాల్లో జరగనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి 83 క్లస్టర్ను పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో 380 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అలాగే 53 ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయని, ఈ గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. డీఎస్పీ రాజేంద్ర, సీఐ సుబ్బరాయుడు, ఎంపీడీవో మహబూబ్ దౌలా, ఈవోఆర్డీ ప్రకాష్నాయుడు, డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్, ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, పోలీసులు పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసాధారణ ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. సోమవారం కొలిమిగుండ్ల పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప విలేకరులతో మాట్లాడుతూ రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికలకు సంబంధించి 240 గ్రామ పంచాయతీల సర్పంచులకు, 2482 వార్డు మెంబర్లకు నామినేషన్లు 2వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. 83 కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. 2,578 పోలీస్స్టేషన్లలో 499 లోకేషన్లు ఉన్నాయన్నారు. జిల్లాలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 40షాడో టీంలు పనిచేస్తున్నాయని, 5వేల మంది పోలీసు సిబ్బందితో పాటు ఏపీఎస్పీ పోలీసు బలగాలను కూడా రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. 122 అతి సమస్యాత్మక గ్రామాలుగా, 258 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామన్నారు. డీఎస్పీ రాజేంద్ర, కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐ హరినాథ్రెడ్డి పాల్గొన్నారు.