వాగులో ఇసుక, మట్టి దందా!
ABN , First Publish Date - 2021-12-31T05:45:52+05:30 IST
మంత్రాలయం మండలం సూగూరు వాగులో ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.

- సూగూరు నుంచి అక్రమ రవాణా
- అనుమతి లేదంటున్న అధికారులు
మంత్రాలయం, డిసెంబరు 30: మంత్రాలయం మండలం సూగూరు వాగులో ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఎక్స్కవేటర్లతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గత 25 రోజులుగా ఇసుక రవాణా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ2వేల నుంచి రూ.4వేల వరకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈ ఇసుకను మంత్రాలయం, చెట్నహల్లి, సుగూరు, మాధవరం, ఎమ్మిగనూరుకు తరలిస్తున్నారు. దీంతో వాగు స్వరూపమే మారిపోతోంది. ఎక్కడ చూసినా గుంతలు కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కూడా తరలిస్తున్నారని, ట్రాక్టర్ల శబ్దానికి నిద్ర లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. మంత్రాలయం తహసీల్దార్ చంద్రశేఖర్, పంచాయతీ సెక్రటరీ హరిక్రిష్ణను వివరణ కోరగా సూగూరు వాగు నుంచి ఇసుక, మట్టి రవాణాకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఎవరైనా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.