ఇంధనం ధరలను తగ్గించాలి: సీపీఎం
ABN , First Publish Date - 2021-10-30T04:02:50+05:30 IST
దేశంలో పెంచిన ఇంధన ఽధరలను తగ్గించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్ పేర్కొన్నారు.
ఆత్మకూరు, అక్టోబరు 29: దేశంలో పెంచిన ఇంధన ఽధరలను తగ్గించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్ పేర్కొన్నారు. శుక్రవారం పెంచిన డీజల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం డీజల్, పెట్రోల్ ధరలపై భారీగా పన్నుల పెంచడం వల్ల సామాన్యులపై తీరని భారం పడిందని అన్నారు. పరోక్షంగా అన్ని రకాల నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డీజల్, పెట్రోల్, గ్యాస్ ధరలపై పన్ను భారం తగ్గించాలని, వాటిని జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామ్నాయక్, సురేంద్ర, నాగేశ్వరరావు, రోషన, బాబు, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
జూపాడుబంగ్లా: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని సీపీఎం జిల్లా నాయకుడు రాజశేఖర్ అన్నారు. జూపాడుబంగ్లాలోని వెంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో మండల మహాసభ కర్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి అధికారం చేపట్టిన మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కులాలమధ్య చిచ్చురేపుతోందని అన్నారు. పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలను పెంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నదని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్లచట్టాలను రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగేశ్వరరావు, భాస్కరరెడ్డి, పక్కిర్సాహెబ్, మండల నాయకులు నాగేశ్వరరావు, రామిరెడ్డి, హుస్సేనబీ, దేవమ్మ పాల్గొన్నారు.
ఆత్మకూరు రూరల్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి నరిసింహనాయక్, ఇతర నాయకులు మాబాషా, వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని అమలాపురం చెంచు గూడెంలో ఈమేరకు గ్యాస్ సిలిండర్లను బైక్తో లాగుతూ నిరసన తెలియ జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్, గ్యాస్పై భారీగా పన్నులు పెంచడం వల్ల విపరీతంగా రేట్లు పెరిగాయన్నారు. దీంతో రవాణా రంగంపై భారం పడి నిత్యావసరాలు అకాశాన్నంటుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పెట్రోల్, డీజిల్, గ్యాస్లపై పెంచిన సుంకాలను తగ్గించక పోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.