సమస్యల్లో రాజోలి
ABN , First Publish Date - 2021-06-24T05:38:36+05:30 IST
రాజోలి ఓ చిన్న గ్రామం. 25 కుటుంబాలు ఉన్నాయి.
- రహదారి లేని గ్రామం
- మూతపడిన పాఠశాల
- పట్టించుకోని పాలకులు, అధికారులు
చాగలమర్రి, జూన్ 23: రాజోలి ఓ చిన్న గ్రామం. 25 కుటుంబాలు ఉన్నాయి. గతంలో 50 కుటుంబాలు ఉండేవి. క్రమంగా ఊరొదిలి వెళ్లిపోయే వారి సంఖ్య పెరిగిపోయింది. 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించే రాజోలి ఆనకట్ట గురించి అందరికీ తెలుసు. కానీ ఆ పేరుతో ఒక ఊరుందని చాలా మందికి తెలియదు. వర్షాకాలం గ్రామం చుట్టూ ఎటు చూసిన నీరు నిలిచిపోతుంది. దీంతో ప్రయాణ సౌకర్యం లేదు. ఆ కాలమంతా ప్రజలు జలదిగ్బంధంలో కాలం గడపాల్సిందే. ఊరికి ఒక వైపు రాజోలి ఆనకట్ట, మరో వైపు చాపాడు కాలువ ఉంది. ఎటు వెళ్లాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వంకలు, వాగులు దాటాల్సిందే. ఈ ఊరు ఏర్పడినప్పటి నుంచి రహదారి సౌకర్యం లేదు. 15ఏళ్ల కిందట రూ.10లక్షలతో పాఠశాల భవనం నిర్మించారు. ప్రారంభించకముందే ఇది నిరుపయోగంగా మారింది. గ్రామానికి ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయులు పాఠశాలకు సక్రమంగా వెళ్లలేకపోయారు. దీంతో పాఠశాల శాశ్వతంగా మూతపడింది. పిల్లలు చదువుకు దూరమయ్యారు. కొన్ని కుటుంబాల వారు పిల్లల చదువు కోసమే కడప జిల్లాకు వలస వెళ్లారు. మండల కేంద్రానికి వెళ్లాలంటే రాజోలి ఆనకట్ట దాటాల్సిందే. చాపాడు చానల్ కట్ట మీదుగా సంవత్సరాల తరబడి రాకపోకలు సాగిస్తున్నారు. బోర్లలోని ఉప్పునీరు తాగాల్సి వస్తోందని, విధిలేక కడప జిల్లాలోని వెల్లాల గ్రామానికి వెళ్లి శుద్ధజలం తెచ్చుకుంటున్నామని గ్రామ స్థులు అంటున్నారు. నిత్యావసర సరుకుల కోసం 3 కి.మీ దూరం వెళ్లాల్సిందే. దశాబ్ద కాలంగా మౌలిక వసతులు లేక ప్రజలు అనేక సమస్యలు పడుతు న్నారు. చుట్టూ నీరు ఉన్నా గ్రామం కింద ఉన్న 1,000 ఎకరాలకు సాగు నీటి సౌకర్యం సరిగా లేదు. దీంతో పొలాలను బీడు పెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నాయకులు రావడమేగాని, ఆ తర్వాత తమ సమస్యలు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం రావడం తప్ప ఆ తర్వాత పట్టించుకో వడం లేదని విమర్శిస్తున్నారు. అధికారులకు అనేకసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా గ్రామానికి తారురోడ్డు, పాఠశాల, వైద్యం, రేషన్ వంటి పలు సౌకర్యాలు అందేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఉప్పునీరే తాగుతున్నాం
గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ద్విచక్ర వాహనాలు ఉన్నవాళ్లం సమీప గ్రామానికి వెళ్లి శుద్ధజలం తెచ్చుకుంటున్నాం. ఆ సౌకర్యం లేనివారు ఉప్పునీరే తాగుతున్నారు. అధికారులు తాగునీటి సమస్య పరిష్కరించాలి.
- గోపాల్, రైతు, రాజోలి గ్రామం
పాఠశాల లేక ఇబ్బందులు
గ్రామంలో పాఠశాల లేదు. చాలా మంది తమ పిల్లలను పట్టణాల్లోని బంధువుల వద్ద ఉంచి చదివించుకుంటున్నారు. మరి కొందరు 6 కి.మీ దూరంలోగల పాఠశాలకు ద్విచక్ర వాహనాల్లో తీసుకెళ్లి చదివించుకుంటున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో విద్యావకాశాలు కల్పించాలి. - మురళి, గ్రామస్థుడు