మెరుగైన సేవలు అందించండి
ABN , First Publish Date - 2021-10-28T05:35:36+05:30 IST
సచివాలయ ఉద్యోగులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు.

- నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
కొలిమిగుండ్ల, అక్టోబరు 27: సచివాలయ ఉద్యోగులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాల గ్రామ పరిధిలోని 321వ సర్వే నంబర్లో ఉన్న 5 ఎకరాలు, 342వ సర్వేనంబర్లో ఉన్న 5 ఎకరాలను రామ్కో సిమెంట్ పరిశ్రమ కోసం నంద్యాల సబ్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గృహాల నిర్మాణాలు, కళ్యాణ మండపాలు, హోటళ్లు, పెట్రోల్ బంక్లు, పరిశ్రమల నిర్మాణం కోసం పంట పొలాలను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ల్యాండ్ కన్వర్షన్ తప్పకుండా చేయించాలన్నారు. వ్యవసాయ భూముల విలువలో 5 శాతం ఫీజు ప్రభుత్వానికి చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేయించుకోవాలన్నారు. అనంతరం కొలిమిగుండ్లలో ఒకటవ, రెండవ సచివాలయాలను, బెలుంలోని సచివాలయాన్ని ఆమె పరిశీలించారు. సచివాలయ సిబ్బంది హాజరుశాతాన్ని పరిశీలించారు. సచివాలయ పరిధిలోని జనాభా వివరాలు, స్ర్తీ, పురుషులు, పిల్లలు, వారి సంఖ్య, పింఛన్ లబ్ధిదారుల వివరాలు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారి వివరాలు, గర్భిణులకు వ్యాక్సినేషన్, వీధిలైట్ల పనితీరు, బోగస్ కార్డుల లిస్ట్ డిస్ప్లే తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు షేక్ మొహిద్దీన్, ఎంపీడీవో రమణ, రామ్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి నాగరాజు, సీనియర్ మేనేజర్ బోసుబాబు, శోభన్బాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.