ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
ABN , First Publish Date - 2022-01-01T05:26:17+05:30 IST
సచివాలయాల్లో జాప్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఉద్యోగులను ఆదేశించారు.

కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కల్లూరు, డిసెంబరు 31: సచివాలయాల్లో జాప్యం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఉద్యోగులను ఆదేశించారు. కల్లూరు మండ లం బొల్లవరం, బస్తిపాడు గ్రామ సచివాలయాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్లు వంటి అంశాలను కలెక్టర్ పరిశీలించారు. బొల్లవరం సచివాలయంలో వలంటీర్లు మాస్కులు ధరించకుండా ఉండడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామంలో జనాభా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఇళ్లలోనే న్యూ ఇయర్ వేడుకలు: కలెక్టర్
కర్నూలు(కలెక్టరేట్), డిసెంబరు 31: కొవిడ్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమైక్రాన వైరస్ వ్యాప్తి చెందుతోందని, దానితో మనం ఇంకా పోరాడాల్సింది ఉందని అన్నారు. వేడుకలను ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇళ్లల్లోనే కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లా ప్రజలందరికీ 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.