కేసుల పరిష్కారానికి శ్రద్ధ వహించండి
ABN , First Publish Date - 2021-09-04T04:35:20+05:30 IST
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదిన జరగబోయే జాతీయ మెగా లోక్అదాలతలో వీలైనంతవరకు పెండింగ్ కేసులను పరిష్కరించేలా పోలీసు అధికారులు శ్రద్ద వహించాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ జడ్జి ఈ.రాజేంద్రబాబు పేర్కొన్నారు.

సీనియర్ సివిల్ జడ్జి ఇ.రాజేంద్రబాబు
ఆత్మకూరు, సెప్టెంబరు 3: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదిన జరగబోయే జాతీయ మెగా లోక్అదాలతలో వీలైనంతవరకు పెండింగ్ కేసులను పరిష్కరించేలా పోలీసు అధికారులు శ్రద్ద వహించాలని ఆత్మకూరు సీనియర్ సివిల్ జడ్జి ఈ.రాజేంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కోర్టుహాల్ నందు ఆత్మకూరు, వెలుగోడు, కొత్తపల్లి, పాములపాడు పోలీసు, ఎక్సైజ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబరు 11వ తేదిన జరగబోవు జాతీయ మెగాలోక్ అదాలతలో పెండింగ్ కేసులను పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి సివిల్, బ్యాంకింగ్, కుటుంబ తగాదాలు, భార్యభర్తల గొడవలు, రాజీ చేసుకోదగ్గ క్రిమినల్ కేసులు, రూ.2లక్షల లోబడి వున్న చెక్బౌన్స కేసులను లోక్అదాలత ద్వారా పరిష్కరించేందుకు అవకాశం వుందని చెప్పారు. వీలైనంత వరకు కక్ష్యిదారులను సమావేశపరిచి పెండింగ్ కేసులను రాజీ చేసేందుకు ఎస్సైలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ సమావేశంలో జూనియర్ సివిల్ రాజన ఉదయ్ ప్రకాష్, ఆత్మకూరు డీఎస్పీ శృతి, సీఐ బీఆర్ కృష్ణయ్య, ఎస్సైలు హరిప్రసాద్, వరప్రసాద్, చిన్నపీరయ్య, రాజ్కుమార్, ముబినీతాజ్, ఏపీపీ బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.