నర్సుల నిరసన
ABN , First Publish Date - 2021-06-17T05:21:22+05:30 IST
కరోనా రోగుల చికిత్సల్లో ముందుండి సేవలందించి ప్రాణాలు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ నర్సుల కటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ డిమాండ్ చేశారు.
కర్నూలు(హాస్పిటల్), జూన్ 16: కరోనా బాధితులకు ముందుండి సేవలందించి ప్రాణాలు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ నర్సుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ డిమాండ్ చేశారు. ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం, ఏపీ నర్సింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ నర్సులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అడ్మినిస్ర్టేటివ్ భవనం ఎదుట బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వీరి నిరసనకు నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1 ఆశాసజని, గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్లు నాగమణి, సావిత్రీబాయి మద్దతు తెలిపారు. అలాగే ఏపీ ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శాంతిభవాని, కర్నూలు యూనిట్ అధ్యక్షురాలు రమణమ్మ, జిల్లా కోశాధికారి లక్ష్మీసరస్వతి సంఘీభావం ప్రకటించారు.
28 నుంచి రిలే దీక్షలు
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ నర్సులను రెగ్యులర్ నర్సులతో సమానంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈ నెల 28 నుంచి దీక్షలు చేపట్టనున్నట్లు మోహన్ తెలిపారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ నర్సెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు అర్చన, కార్యవర్గ సభ్యులు శ్రీదేవి, హర్షద్, అమృత, హరిషా పాల్గొన్నారు.